‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో పాల్గొన్న హీరో శర్వానంద్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వతహాగా స్వీకరించి బంజారాహిల్స్ లోని తన ఇంటి పక్కన ఉన్న పార్క్లో మొక్కలు నాటారు హీరో శర్వానంద్. ఆయనతోపాటు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు మొక్కలు నాటుతూ తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. తాాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వతహాగా స్వీకరించి బంజారాహిల్స్ లోని తన ఇంటి పక్కన ఉన్న పార్క్లో మొక్కలు నాటారు హీరో శర్వానంద్. ఆయనతోపాటు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో శర్వానంద్ మాట్లాడుతూ… “సంతోష్ అన్న ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని దీన్ని చూసి నేను కూడా మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నాను… రోజు రోజుకు మారుతున్న వాతావరణ మార్పులతో.. మనం భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకూడదు అంటే మనందరం మొక్కలు నాటాలి. వాటిని రక్షించి భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాాలి. ఇదే స్ఫూర్తితో మా ఇంటి పక్కన ఉన్న జిహెచ్ఎంసి పార్కులో మొక్కలు పెంచాలని నిర్ణయించాను. ఈ పార్కును నేను దత్తత తీసుకొని ఈ మొక్కలను రక్షించే బాధ్యతతో పాటు.. ఇందులో వాకింగ్ ట్రాక్తోపాటు.. పార్కు అభివృద్ధిని నా సొంత డబ్బులతో చేయాలని ఈ రోజు నిర్ణయం తీసుకున్నాను.” ఈ సందర్భంగా ఈ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో కి అనిల్ సుంకర( AK ఎంటర్ప్రైజెస్), గోపి ఆచంట , రామ్ ఆచంట (14 రీల్స్), వంశీ, విక్కీ , ప్రమోద్ (UV క్రియేషన్స్) సుధాకర్ చెరుకూరి (SLV)లకు మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు హీరో శర్వానంద్. పార్కును దత్తత తీసుకున్న శర్వానంద్ను అభినందించారు ఎంపీ సంతోష్ కుమార్.