PM Modi: తనను పెద్దన్న అంటున్న సీఎం రేవంత్పై ప్రధాని మోదీ కామెంట్ ఇదే…
అవినీతిలో పతకాలు ఇస్తే తెలంగాణ కాంగ్రెస్ సర్కారుకు గోల్డ్ మెడల్, అంతకు ముందున్న బీఆర్ఎస్ సర్కారుకు సిల్వర్ మెడల్ వస్దుందని ప్రధాని మోదీ అన్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తమైన చోట ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్తో జనాల్ని పీడిస్తున్నారని మోదీ తెలిపారు.
దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ టీవీ9కి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. టీవీ9 గ్రూప్కు చెందిన ఐదుగురు మేనేజింగ్ ఎడిటర్లు అడిగిన ప్రశ్నలకు ప్రధాని సూటిగా సమాధానమిచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మిమ్మల్ని పెద్దన్న అన్నారు. మరి తమ్ముడి పాలనపై మీ అభిప్రాయమేంటి? అని టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ మోదీని ప్రశ్నించారు. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఇదే.
“అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు దొందుదొందే. అందులో మెడల్స్ ఇవ్వాల్సి వస్తే కాంగ్రెస్కి స్వర్ణపతకం, బీఆర్ఎస్కి వెండిపతకం పొందే అర్హత ఉంది. ఆ విషయంలో ఒకరు విన్నర్ అయితే మరొకరు రన్నరప్. ఇక పెద్దన్నయ్యగా భావిస్తే మంచిదే. కానీ ఆ భావన నిజమైతే మా నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. నిజాయితీగా ప్రభుత్వాన్ని నడపాలి. నిజాయితీగా దేశసేవ చేయాలి. సీఎంగా, పీఎంగా సుదీర్ఘకాలం ఈ దేశానికి సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. నిందలుమోపే ప్రయత్నాలు జరిగినా నాకు ఒక్క మరక అంటలేదు. నా క్రెడిట్ తీసుకునేందుకు పెద్దన్న అంటే సరిపోదు. తమ్ముడినని భావిస్తే నేర్చుకునే ప్రయత్నం చేయాలి. మీరు మంచి చేస్తేనే ప్రజల నుంచి ఆ పుణ్యఫలం లభిస్తుంది.” అని ప్రధాని పేర్కొన్నారు.
‘ఉచిత విద్యుత్ లక్ష్యంగా పెట్టుకున్న 3కోట్లమందిలో తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు. నల్ సే జల్ లబ్ధిదారుల్లో తెలంగాణవారు కూడా ఉంటారు. ఉచితరేషన్కింద తెలంగాణ ప్రజలు కూడా లబ్ధిపొందుతారు. 70ఏళ్ల పైబడ్డ వృద్ధులకు ఆరోగ్య చికిత్స బాధ్యత మా ప్రభుత్వానిది. తెలంగాణ వృద్ధులు కూడా అందులో ఉంటారు. నా గ్యారంటీ దేశప్రజలందరి కోసం’ అని ప్రధాని తెలిపారు.
మరిన్నిజాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.