ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారి.. మనుషులనే కాదు మూగ జీవాలను కూడా బలి తీసుకుంటోంది. గతేడాది హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఏకంగా 8 సింహాలు కొవిడ్ బారిన పడ్డాయి. తాజగా చెన్నైలోని ఓ నేషనల్ పార్క్ లో రెండు సింహాలు ఈ మహమ్మారి బారిన పడి మృత్యువాత పడ్డాయి. ఇలా మూగజీవాలకు సైతం ఈ మహమ్మారి సోకుతుండడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జంతువులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు హరియాణాలోని ఐసీఏఆర్- నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ (NRCE) సంస్థ తయారు చేసిన టీకాతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఢిల్లీ, బెంగళూరు, భోపాల్, నాగపూర్, జునాగఢ్, జైపూర్ లలో ఉన్న ఆరు జూపార్క్ లలో ఈ టీకా ట్రయల్స్ జరగనున్నాయి.
కేవలం వాటికి మాత్రమే..
కాగా దేశంలోని పలు జూపార్క్ ల్లో సింహాలు, పులులు వరుసగా కరోనా బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జంతువులకు కూడా వ్యాక్సిన్ తయారుచేయాలని హరియాణాలోని ఐసీఏఆర్- ఎన్ఆర్ సీఈకి పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEFCC) ఆదేశాలు ఇచ్చింది. కాగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా కేవలం సింహాలు, పులులు, చిరుత పులులకు మాత్రమే టీకాలు ఇవ్వనున్నారు. అదేవిధంగా ఒక జాతికి చెందిన జంతువులు 15కు మించి ఉన్న జూ పార్కు ల్లోనే ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. రెండు డోసుల మధ్య వ్యవధిని 28 రోజులుగా నిర్ణయించారు. జంతువులకు రెండవ డోస్ ఇచ్చిన తర్వాత దాదాపు రెండు నెలల పాటు వాటిని ప్రత్యేక అబ్జర్వేషన్ లో ఉంచి యాంటీ బాడీస్ ని పర్యవేక్షించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతులు రాగానే క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించనున్నట్లు జునాగఢ్ లోని సక్కర్ బాగ్ జూ డైరెక్టర్ చెప్పుకొచ్చారు. కాగా మొదటిసారిగా అమెరికాలోని బ్రోనెక్స్ జూలో జంతువులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఇక ఇండియా విషయానికొస్తే.. గతేడాది హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్క్ లో 8 ఆసియా సింహాలు ఈ మహమ్మారి బారిన పడ్డాయి.
Also Read: IND VS SA: రెండో వన్డేలోనూ చతికిలపడిన టీమిండియా .. సిరీస్ సఫారీల వశం..
Budget 2022: బడ్జెట్లో రైతులకు గుడ్న్యూస్ రానుందా..!