చిక్కుల్లో టీడీపీ మరో మాజీ ఎంపీ
మాజీ ఎంపీ రాయపాటి మరోసారి చిక్కుల్లో చిక్కుకున్నారు. రాయపాటి షూరిటీగా వ్యవహరిస్తున్న ట్రాన్స్ట్రాయ్ లిమిటెడ్ ఆస్తుల వేలానికి రంగం సిద్ధం చేశారు. సెంట్రల్ బ్యాంక్ కు సుమారు రూ.452.41 కోట్లు ట్రాన్స్ ట్రాయ్ బకాయి..
మాజీ ఎంపీ రాయపాటి మరోసారి చిక్కుల్లో చిక్కుకున్నారు. రాయపాటి షూరిటీగా వ్యవహరిస్తున్న ట్రాన్స్ట్రాయ్ లిమిటెడ్ ఆస్తుల వేలానికి రంగం సిద్ధం చేశారు. సెంట్రల్ బ్యాంక్ కు సుమారు రూ.452.41 కోట్లు ట్రాన్స్ ట్రాయ్ బకాయి పడింది. కాగా తనఖా పెట్టిన ఆస్తులను ఆగస్టు 18న వేలం వేయనున్నట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఈ నేపథ్యంలో బిడ్స్ దాఖలుకు ఆగస్టు 14న చివరి తేదీ అని ప్రకటించింది.
అయితే 2017 జనవరి 9నాటికి సెంట్రల్ బ్యాంక్కు చెల్లించాల్సిన మొత్తం 452.41 కోట్లు కాగా, వీటికి హామీదారులుగా ట్రాన్స్ట్రాయ్ మాజీ ఎండీ శ్రీధర్, రాయపాటితోపాటు మరో ఐదుగురు ఉన్నారు. ఇదే కాక ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కెనరా బ్యాంక్కు సంబంధించి సుమారు రూ.300 కోట్లు మోసం చేసిన కేసులోనూ రాయపాటిపై సీబీఐ కేసు నమోదైంది. ఈ బకాయిలు మాత్రమే కాకుండా వివిధ బ్యాంకుల ద్వారా రూ.3,694 కోట్ల మేర రుణాలను ట్రాన్స్ట్రాయ్ సంస్థ తీసుకుంది.
రాయపాటికి చెందిన ఆస్తులను వేలం వేస్తున్నట్టు ఆంధ్రాబ్యాంక్ కూడా కొద్దిరోజుల క్రితం పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. బ్యాంకు నుంచి ట్రాన్స్ట్రాయ్ ఇండియా, చెరుకూరి శ్రీధర్, మల్లినేని సాంబశివరావు, రాయపాటి రంగారావు, దేవికారాణి, లక్ష్మి పేరుతో అప్పుగా తీసుకున్నారు. ఈ అప్పుకు గ్యారెంటీగా రాయపాటి జగదీష్, రాయపాటి జీవన్, నారయ్యచౌదరి, రంగారావు, దేవికారాణి, లక్ష్మి, సీహెచ్ వాణి, జగన్మోహన్ యలమంచలి ఉన్నారు.