తుగ్లక్ పాలన మీ బాబుదే… ఆ పాపం మీదే… లోకేష్ పై బొత్స ఫైర్!

ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేయలేని పనులు.. జగన్ 100 రోజుల్లోనే చేయగలిగారన్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ సంక్షేమ పాలన చూసి ఓర్వలేక జగన్‌పై చంద్రబాబు కడుపుమంట పెంచుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పాలన చూసి తట్టుకోలేకపోతున్నారని.. అందుకే ప్రభుత్వంపై  విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన బొత్స… చంద్రబాబు, లోకేష్‌లపై ఘాటు విమర్శలు చేశారు. ప్రజలకు ఏం చేయలేదని విమర్శిస్తున్నారో చెప్పాలన్నారు బొత్స. చంద్రబాబు, లోకేష్‌లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. తుగ్లక్ […]

తుగ్లక్ పాలన మీ బాబుదే... ఆ పాపం మీదే... లోకేష్ పై బొత్స ఫైర్!
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 09, 2019 | 12:33 PM

ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేయలేని పనులు.. జగన్ 100 రోజుల్లోనే చేయగలిగారన్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ సంక్షేమ పాలన చూసి ఓర్వలేక జగన్‌పై చంద్రబాబు కడుపుమంట పెంచుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పాలన చూసి తట్టుకోలేకపోతున్నారని.. అందుకే ప్రభుత్వంపై  విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన బొత్స… చంద్రబాబు, లోకేష్‌లపై ఘాటు విమర్శలు చేశారు.

ప్రజలకు ఏం చేయలేదని విమర్శిస్తున్నారో చెప్పాలన్నారు బొత్స. చంద్రబాబు, లోకేష్‌లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. తుగ్లక్ పాలనంటే చంద్రబాబుదంటూ చురకలంటించారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి.. హైదరాబాద్ నుంచి అర్థరాత్రి మూటా ముల్లే సర్థుకొని పారిపోయి వచ్చింది చంద్రబాబే అన్నారు. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చినవాడు తుగ్లక్ అవుతారా.. లేక జగన్ తుగ్లక్ అవుతారా అంటూ ప్రశ్నించారు. తుగ్లక్ అంటూ పదే పదే విమర్శలు చేస్తున్న వ్యక్తికి దాని అర్థం తెలుసా అన్నారు. ట్విట్టర్‌లో ఏదేదో ట్వీట్ చేసి మేధావి అనుకుంటే ఎలా అంటూ లోకేష్‌పై మండిపడ్డారు.

రాష్ట్రం విడిపోకూడదని రాజశేఖర్‌రెడ్డి పోరాడితే.. 2008లో పొలిట్ బ్యూరోలో చర్చించి విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చింది చంద్రబాబు కాదా అని మంత్రి ప్రశ్నించారు. ‘చంద్రబాబు పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయి. ఇప్పుడు శాంతియుత పాలన సాగుతుంటే పెయిడ్ ఆర్టిస్టులతో పునరావాస కేంద్రాలను పెడుతున్నారు. చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు నమ్మరు. కోడెల టాక్స్ వసూళ్లు చేశాడా లేదా.. చింతమనేని దళితులను కులం పేరుతో దూషించారా లేదా.. కూన రవి కుమార్ ఉద్యోగులను తిట్టారా లేదా…దళిత ఎమ్మెల్యే శ్రీదేవిని టీడీపీ నేతలు దూషించారా లేదా.. సోమిరెడ్డి తప్పుడు పత్రాలతో భూములు కాజేశారా లేదా వీటన్నింటికి చంద్రబాబు సమాధానం చెప్పాలి’ అని బొత్స డిమాండ్‌ చేశారు. ఓడిపోయినా చంద్రబాబులో మార్పు రాలేదని. వరదలు వస్తే చంద్రబాబు బురద రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 100 రోజుల్లో టీడీపీ ప్రజల కోసం చేసిన ఒక్క పోరాటం చూపించాలన్నారు.

ఏపీ రాజధాని అమరావతి అని చంద్రబాబు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారా అని ప్రశ్నించారు బొత్స. ఇతర నిర్మాణాలలాగే అమరావతిని తాత్కాలికంగా ఉంచారని.. గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబు చెప్పాలన్నారు. అన్నిటికీ తాత్కాలికం అని పేరుపెట్టి.. మీరా జగన్‌ పాలనను విమర్శించేది? అని చంద్రబాబును ప్రశ్నించారు. ఈ రాష్ట్రానికి చిరునామా లేకుండా చేసింది మీరు కాదా? అని విమర్శించారు. పెట్టుబడిదారులు ఎక్కడికీ వెళ్లిపోరని బొత్స పునరుద్ఘాటించారు. జగన్ ప్రధానిని కలిసిన ప్రతిసారీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే ఉన్నారని.. చంద్రబాబు ప్రధానికి ఇచ్చిన లేఖలో అసలు హోదా ప్రస్తావనే లేదన్నారు.

రాజధాని విషయంలో జనసేన మేధో మథనంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటరిచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమా ప్రపంచం నుంచి బయటకు వచ్చి మాట్లాడాలన్నారు బొత్స. మంత్రి ఎలా ఉండాలో ఆయనకు తెలిస్తే చెప్పాలన్నారు. అమరావతిలో రాజధాని వద్దని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారని.. మళ్లీ రాజధాని ఇక్కడే ఉండాలని అంటున్నారని.. ఇదేం పద్దతని విమర్శించారు.