కరోనా టెస్టులపై మంత్రి ఈటల క్లారిటీ !
తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కరోనా టెస్టులు చేయట్లేదన్న ఆరోపణలపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.
తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కరోనా టెస్టులు చేయట్లేదన్న ఆరోపణలపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయుర్వేద రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. రెడ్ జోన్లో పని చేస్తున్న పోలీస్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి ఆయుర్వేద రక్ష కిట్లను అందజేయనున్నారు. 20 వేల కిట్లను మొదటి దఫా పంపిణీ చేయనున్నారు. శనివారం బీఆర్కేఆర్ భవన్లోని మంత్రి కార్యాలయంలో ఆయుర్వేద రక్ష కిట్లను పోలీసు అధికారులకు అందించారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్ జాయింట్ సీపీ విశ్వప్రసాద్, తదితరులకు మంత్రి కిట్స్ అందజేశారు.
ఈ సందర్బంగా ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ..ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రంలో కరోనా టెస్టులు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. తక్కువ కేసులు వస్తున్నాయి కాబట్టి తక్కువ టెస్టులు చేస్తున్నారని వస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. కరోనా రోగుల కుటుంబ సభ్యులకూ లక్షణాలు ఉంటేనే టెస్టులు చేస్తున్నామని లేదంటే చేయట్లేదని తెలిపారు. కాగా, రాష్ట్రంలో పూర్తయిన పరీక్షల లెక్కలను సర్కారు అధికారికంగా ప్రకటించట్లేదని మంత్రి పేర్కొన్నారు.