TDP on Budget Session: ఈనెల 20వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశం.. బడ్జెట్ సెషన్ బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నిర్ణయం తీసుకుంది.
TDP boycott budget session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నిర్ణయం తీసుకుంది. ప్రజా సమస్యలు, బడ్జెట్పై చర్చ లేకుండా ఒక్కరోజు అసెంబ్లీ పెట్టేందుకు అధికార వైఎస్ఆర్సీపీ సిద్దమవుతున్న నేపథ్యంలో టీడీపీ సమావేశాలకు హాజరు కావద్దని నిర్ణయించుకుంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ నెల 20వ తేదీన సమావేశం కాబోతోందని ఈనెల 13వ తేదీన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. ఇదేక్రమంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ముఖ్యమంత్రి జగన్ సర్కారు ఎల్లుండి అసెంబ్లీలో 2021 – 22 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టబోతోంది. బడ్జెట్ రూపకల్పనపై ఇప్పటికే ప్రభుత్వం పూర్తిస్థాయిలో కసరత్తు చేసింది. అయితే, బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం ఎన్ని రోజులు నిర్వహిస్తుంది. కరోనా నేపథ్యంలో పద్దు ప్రవేశపెట్టడం వరకే పరిమితమవుతుందా? లేదా? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
అయితే, అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణియించుకుంది. ప్రజా సమస్యలు ,బడ్జెట్ పై చర్చ లేకుండా ఒక్కరోజు అసెంబ్లీ పెట్టడాన్ని టీడీపీ తప్పుపట్టింది. కరోనా పై కనీసం అఖిలపక్షం కానీ నిపుణుల తో సమావేశం పెట్టి సలహాలు తీసుకోలేదని ..కరోనా నియంత్రణ లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇవాళ పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. మెజార్టీ నేతలు అభిప్రాయం మేరకు అసెంబ్లీని బాయ్కాట్ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్రాలు మార్చి నెలలోనే బడ్జెట్ సమావేశాలు నిర్వహించుకుంటే.. జగన్ ప్రభుత్వం ఎందుకు బడ్జెట్ పెట్టలేదో సమాధానం చెప్పాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతుంటే.. ఆక్సిజన్ అందక, బెడ్స్ లేక ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. కనీసం అఖిలపక్షం సమావేశం కానీ, నిపుణులతో సలహాలు తీసుకోలేదని మండిపడ్డారు. పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు..
తప్పుడు లెక్కల బడ్జెట్, పొగడ్తలు కోసమే ఇపుడు అసెంబ్లీ నిర్వహిస్తున్నారని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. రాజ్యాంగ నిబంధనలు ప్రకారం బడ్జెట్ కోసమే అసెంబ్లీ పెడుతున్నారని.. జగన్ కు చట్ట సభలంటే గౌరవం లేదన్నారు.. కరోనాతో ప్రజల ఆర్తనాదాలు వినపడటం లేదా అని ప్రశ్నించారు. ఒకవైపు వైరస్ బారినపడి ప్రజల ప్రాణాలు పోతుంటే.. జగన్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు.