Ballala Panduga: అంగరంగ వైభవంగా బల్లల పండుగ.. ఎవరు, ఎందుకు చేస్తారో తెలుసా..?

| Edited By: Jyothi Gadda

Jan 29, 2024 | 7:11 PM

తమకు అన్నం పెట్టే ఆ బండకు ఏడాదికి ఒకసారి జనవరి నెలలో 15 రోజుల పాటు పూజలు చేస్తారు. దీనినే బల్లల పండుగ అంటారు. ఈ పండుగను చేసే క్రమంలో పండుగ జరిగే 15 రోజులు ఇతర ఏ పనులు చేయరు. పండుగ జరిగే 15 రోజుల్లో ఒక ఆదివారాన్ని ఎంచుకొని అక్కడ బట్టలు ఉతికే బల్లలు పెట్టీ గంగమ్మ తల్లికి పూజలు చేస్తారు. ఎందుకంటే నీళ్లలో ఉన్న బండ వద్ద బట్టలు ఉతికే సమయంలో..

Ballala Panduga: అంగరంగ వైభవంగా బల్లల పండుగ.. ఎవరు, ఎందుకు చేస్తారో తెలుసా..?
Ballala Panduga
Follow us on

ఏలూరు, జనవరి 29; ప్రస్తుత జీవన విధానంలో ఎన్నో వైవిద్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఎవరికివారు తమ జీవనోపాధి కోసం ఉద్యోగ వ్యాపార రీత్యా ఆయా ప్రాంతాలకు వలసలు వెళ్లి జీవనం సాగిస్తుంటే మరికొందరు అనాదిగా వస్తున్న కులవృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ముఖ్యంగా ప్రాచీన కాలంలో కుమ్మరులు కుండలు, మేదరులు బుట్టలు, రజకలు బట్టలు ఉతుకుతూ, విశ్వబ్రాహ్మణులు కమ్మరి కొలుములలో పనిముట్లు చేస్తూ, గిరిజనులు వేటాడుతూ, బ్రాహ్మణులు పౌరోహిత్యం ఇలా ఎవరి కులవృత్తిని వారు చేస్తూ జీవనం సాగించేవారు. కానీ రాను రాను పోటీ ప్రపంచంలో పల్లెల్లో కులవృత్తులు చాలాచోట్ల కనుమరుగయ్యి ఉపాధి కోసం వారు పట్టణాల బాట పడుతున్నారు.

అయితే కుల వృత్తుల మీద గౌరవం ఉన్న కొందరు ఇప్పటికీ వారి కులాలకు చెందిన సాంప్రదాయ పండుగలను నిర్వహిస్తూ తమ భవిష్యత్ తరాలకు తమ పూర్వీకుల విశిష్టతలు, వృత్తులు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో రజకులు బల్లల పండుగను ఘనంగా నిర్వహించారు. అసలు ఈ బల్లల పండుగ అంటే ఏంటి… అది ఎలా చేస్తారు.. ఎందుకు నిర్వహిస్తారు… ఆ పండుకు జరిగే విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ముఖ్యంగా రజకులు ఏడాదికి ఒకసారి బల్లల పండుగను నిర్వహిస్తారు. ప్రాచీన కాలంలో రజకుల కులవృత్తి బట్టలు ఉతకడం. నదులు, చెరువులు, కాలువలు వద్ద పెద్ద పెద్ద బండలు ఏర్పాటు చేసి వాటిపై బట్టలు ఉతికేవారు. అయితే తమకు అన్నం పెట్టే ఆ బండకు ఏడాదికి ఒకసారి జనవరి నెలలో 15 రోజుల పాటు పూజలు చేస్తారు. దీనినే బల్లల పండుగ అంటారు. ఈ పండుగను చేసే క్రమంలో పండుగ జరిగే 15 రోజులు ఇతర ఏ పనులు చేయరు. పండుగ జరిగే 15 రోజుల్లో ఒక ఆదివారాన్ని ఎంచుకొని అక్కడ బట్టలు ఉతికే బల్లలు పెట్టీ గంగమ్మ తల్లికి పూజలు చేస్తారు. ఎందుకంటే నీళ్లలో ఉన్న బండ వద్ద బట్టలు ఉతికే సమయంలో ఎటువంటి విషపురుగులు, పాములు, ఇతరత్రా కీటకాల నుంచి తమకు హాని కలగకుండా కాపాడిన గంగమ్మకు మొక్కులు తీర్చుకుంటారు. అందులో భాగంగా కోళ్లను, మేకలను వధించి వాటిని గంగమ్మ ప్రసాదంగా వండుకొని అందరూ కలిసి భుజిస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే కొవ్వూరులో శ్రీ గౌతమి రజక సేవా సంఘం ఆధ్వర్యంలో గోదావరి నది ఒడ్డున బల్లల పండుగ ఘనంగా నిర్వహించారు. ఆ గంగమ్మ తల్లికి పూజలు చేసి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలోనే తమ బంధువులను సైతం ఈ పండుగకు పిలిచి తమ కులవృత్తులను భావితరాలకు గుర్తుండేలా చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నామని గౌతమి రజక సంఘం సభ్యులు అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..