ఏపీ రాజకీయాల్లో ఆ కుటుంబానికి తిరుగులేదు.. కూటమి ధాటికి ఓటమి తప్పలేదు.. కారణాలేంటి..

| Edited By: Srikar T

Jun 08, 2024 | 10:45 AM

ఆయన రాజకీయాల్లో సీనియర్.. పార్టీ తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో ట్రబుల్ షూటర్. పార్టీలో ఏ సంక్షోభం వచ్చినా ఆయన ముందుండాల్సిందే. వివాదాస్పద నిర్ణయాల్లో ఆయన వ్యూహం కీలకం. ఉత్తరాంధ్ర రాజకీయాలను తన కనుసన్నల్లో నడిపిన ఆ నేత ప్రస్తుతం ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. ఆయన ఒక్కరే కాదు ఆయన కుటుంబం అంతా ఓటమి పాలయ్యారు. అంతటి రాజకీయ చాణక్యం ఉన్న ఆ నేత ఓటమికి గల కారణాలు ఏంటి? ఇదే చర్చ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అమరావతి రాజధాని వ్యవహారం అయినా? మూడు రాజధానుల నిర్ణయం అయినా?

ఏపీ రాజకీయాల్లో ఆ కుటుంబానికి తిరుగులేదు.. కూటమి ధాటికి ఓటమి తప్పలేదు.. కారణాలేంటి..
Ysrcp
Follow us on

ఆయన రాజకీయాల్లో సీనియర్.. పార్టీ తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో ట్రబుల్ షూటర్. పార్టీలో ఏ సంక్షోభం వచ్చినా ఆయన ముందుండాల్సిందే. వివాదాస్పద నిర్ణయాల్లో ఆయన వ్యూహం కీలకం. ఉత్తరాంధ్ర రాజకీయాలను తన కనుసన్నల్లో నడిపిన ఆ నేత ప్రస్తుతం ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. ఆయన ఒక్కరే కాదు ఆయన కుటుంబం అంతా ఓటమి పాలయ్యారు. అంతటి రాజకీయ చాణక్యం ఉన్న ఆ నేత ఓటమికి గల కారణాలు ఏంటి? ఇదే చర్చ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అమరావతి రాజధాని వ్యవహారం అయినా? మూడు రాజధానుల నిర్ణయం అయినా? టీచర్ల బదిలీలు అయినా? పార్టీలో తీసుకునే ఏ వివాదాస్పద నిర్ణయం అయినా ఆయనే ముందుండి నడిపించాల్సిందే. ఆయన ఎవరో కాదు రాష్ర్ట రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.

రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. 1999లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంపిగా గెలిచిన బొత్స అప్పటినుండి తిరుగులేని నేతగా ఎదిగారు. ఉత్తరాంధ్ర నుండి బీసీ నేతగా ఎదిగిన బొత్స ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. అప్పటి నుండి బొత్స చరిష్మా మరింతగా పెరిగింది. 2009, 2014, 2019 ఎన్నికల్లో కూడా ఈ కుటుంబం నుండి నలుగురు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మరోసారి ప్రస్తుత ఎన్నికల్లో బరిలోకి దిగారు. బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుండి, ఆయన సోదరుడు బొత్స అప్పల నరసయ్య గజపతినగరం నుండి, ఆయన సతీమణి బొత్స ఝాన్సీలక్ష్మి విశాఖ ఎంపీ అభ్యర్థిగా, మరో సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో దిగారు. నలుగురు పోటీచేయడమే కాకుండా వీరి ప్రజాదరణ కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. అలాంటి బొత్స కుటుంబం ఇప్పుడు ఘోర పరాజయం చవిచూసింది. బొత్స సతీమణి ఝాన్సీలక్ష్మి విశాఖలో టిడిపి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ చేతిలో సుమారు 5 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో ఘోర ఓటమి పాలయ్యారు. బొత్స సత్యనారాయణ పోటీచేసిన చీపురుపల్లిలోనూ టిడిపి అభ్యర్థి, మాజీ మంత్రి అయిన కిమిడి కళా వెంకట్రావు చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక్కడ ఫలితాలు చివరి క్షణం వరకు నువ్వా నేనా అన్నట్లు సాగినా చివరికి బొత్సకు ఓటమి తప్పలేదు.

ఇక ఆయన సోదరుడు బొత్స అప్పల నరసయ్య టిడిపి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ రావు చేతిలో సుమారు 24 వేల ఓట్ల తేడాతో పరాజయం పొందారు. బొత్స మరో సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోనే అత్యధిక మెజారిటీ సాధిస్తే ప్రస్తుత ఎన్నికల్లో సుమారు 40 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఇలా ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసిన నలుగురు బొత్స కుటుంబీకులు ఓటమి పాలవ్వడం తీవ్ర చర్చకు తెర లేపింది. ఈ నలుగురితో పాటు బొత్స మేనల్లుడు చిన్న శ్రీను కూడా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తుంటారు. ఏ పని అయినా చిటికెలో చేసి పెడతారు. అలాంటి ఈ కుటుంబం ఓటమికి కారణాలు ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు బొత్స అభిమానులు, అనుచరులు. రాష్ట్రవ్యాప్తంగా వీచిన ప్రభుత్వ వ్యతిరేకతలో భాగంగా ఈ కుటుంబానికి ఓటమి తప్పలేదని కొందరు, కాదు కాదు క్యాడర్ ఈ సారి ఎన్నికలకు దాదాపు దూరంగా ఉండటం వల్ల.. పోల్ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడం వల్ల ఓటమి పాలయ్యారని మరికొందరు ఇలా బొత్స కుటుంబం ఓటమికి అనేక కారణాలు చెప్తున్నారు స్థానిక వైసిపి నేతలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..