Andhra Pradesh: వాలంటీర్‌ హత్య కేసులో విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్‌ అరెస్ట్.. మదురైలో అదుపులోకి..

|

Oct 21, 2024 | 8:57 PM

ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజకీయ కక్షతోనే తన కొడుకును అరెస్ట్‌ చేశారని విశ్వరూప్ విమర్శించారు. అయితే కేసు విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.

Andhra Pradesh: వాలంటీర్‌ హత్య కేసులో విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్‌ అరెస్ట్.. మదురైలో అదుపులోకి..
Volunteer Murder Case
Follow us on

మాజీమంత్రి, వైసీపీ నేత పినిపె విశ్వరూప్‌కు షాక్ తగిలింది. దళిత యువకుడు, వాలంటీర్‌ జనుపల్లి దుర్గాప్రసాద్‌ హత్య కేసులో విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తమిళనాడులోని మధురైలో శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అయినవిల్లిలో రెండేళ్ల క్రితం జరిగిన దళిత యువకుడి హత్య కేసులో పినిపె శ్రీకాంత్‌ను పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించారు. కోనసీమ అల్లర్ల సమయంలో అయినవిల్లికి చెందిన వాలంటీరు దుర్గాప్రసాద్‌ను 2022 జూన్‌ 6న హత్య చేయించినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఉప్పలగుప్తం మండలానికి చెందిన నిందితుడు, మృతుడికి స్నేహితుడైన వడ్డి ధర్మేశ్‌ను పోలీసులు విచారించారు. అతడిని ఈ నెల 18న అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో మరో నలుగురు నిందితులతోపాటు పినిపె శ్రీకాంత్‌ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే మదురైలో విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు తనను అరెస్ట్ అక్రమమని ఆరోపించారు శ్రీకాంత్. పథకం ప్రకారమే కేసులో ఇరికించారని ఆరోపించారు. వాలంటీర్‌ దుర్గాప్రసాద్ హత్య కేసుతో సంబంధం లేదన్నారు. తన కుమారుడి అరెస్ట్‌ను తప్పుబట్టిన మాజీ మంత్రి విశ్వరూప్… రాజకీయ కక్షతోనే తన కొడుకును అరెస్ట్‌ చేశారన్నారు. దుర్గాప్రసాద్‌ హత్యతో తన కొడుకుకు ఏ మాత్రం సంబంధం లేదన్నారు. ధర్మేష్‌ను భయపెట్టి తన కుమారుడి పేరు చెప్పించారని ఆరోపించారు. తన కొడుకు శ్రీకాంత్ అరెస్ట్‌పై కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.

వీడియో చూడండి..

హత్యకు గురైన వలంటీర్‌కు విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్‌తో సంబంధం ఉందన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. వైసీపీ ఓడిపోయిన తర్వాత బాధితుల్లో ధైర్యం వచ్చి తన దగ్గరికి వచ్చారని తెలిపారు. ఈ కేసు విషయంలో న్యాయం చేయాలని బాధితురాలు కోరారని తెలిపారు. కేసు విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని మంత్రి సుభాష్ అన్నారు.

కూటమి ప్రభుత్వం తమ నేతలను వేధిస్తోందని వైసీపీ ఆరోపిస్తున్న క్రమంలోనే.. మాజీమంత్రి కుమారుడు అరెస్ట్ జరగడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఇలా చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే.. తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరని ప్రభుత్వం చెబుతోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి