AP Council Bill: ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. శాసన మండలి రద్దు నిర్ణయం వెనక్కి.. ఆమోదించిన అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శాసనమండలిని రద్దు చేస్తూ గత ఏడాది తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కౌన్సిల్ రద్దు నిర్ణయం వెనక్కి తీసుకునే తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఆమోదించింది.

AP Council Bill: ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. శాసన మండలి రద్దు నిర్ణయం వెనక్కి.. ఆమోదించిన అసెంబ్లీ
Buggana
Follow us

|

Updated on: Nov 23, 2021 | 4:17 PM

AP Council Bill: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శాసనమండలిని రద్దు చేస్తూ గత ఏడాది తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కౌన్సిల్ రద్దు నిర్ణయం వెనక్కి తీసుకునే తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. గతంలో సందిగ్ధత ఉండేదని, ఏదో రకంగా అసెంబ్లీ నిర్ణయాలను అడ్డుకోవాలని ఇన్నాళ్లు చూశారని ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడా పరిస్థితి లేదని, అందుకే కౌన్సిల్‌ను కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. జనవరి 27,2020న శాసనమండలిని రద్దు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానాన్ని చేసింది. దీంతో గత కొంతకాలంగా కౌన్సిల్‌పై సందిగ్ధత కొనసాగింది. దీంతో ఇవాళ మండలి రద్దు నిర్ణయం వెనక్కి తీసుకుంటూ అసెంబ్లీ అమోదం తెలిపింది.

24 గంటలు తిరగకుండానే జగన్ సర్కార్ మరో యూ టర్న్ తీసుకుంది. శాసనమండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని 168 అధికరణ కింద 1958లో శాసన మండలిని ఏర్పాటు చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో శాసన మండలిని రద్దు చేశారని ఆయన గుర్తు చేశారు. తిరిగి 2006లో శాసన మండలిని మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పునరుద్ధరించారని ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధుల నుంచి ఎన్నుకోబడిన మండలి సుప్రీం అయినప్పటికీ దిగువ సభకు సూచనలు చేయాల్సి ఉందన్నారు.

ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు శాసన మండలిని రద్దు చేయగా.. మరికొన్ని రాష్ట్రాల్లో అసలు ఏర్పాటే చేయలేదని మంత్రి బుగ్గన గుర్తు చేశారు. కొన్ని కీలక అంశాల్లో సందిగ్ధతకు కారణమవుతున్నందున రద్దు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కొత్త సభ్యులు మండలిలోకి వచ్చినట్లు తెలిపారు. కొత్త సభ్యుల రాకతో శాసనమండలి ఇకపై అసెంబ్లీ నిర్ణయాలకు అనుగుణంగా ఉంటుందనే భావనతో గతంలో రద్దు చేస్తూ చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి బుగ్గన సభకు తెలిపారు.

ఓ వైపు మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో వెనక్కి తీసుకోగా.. మరోవైపు కొత్తగా ఎంపికైన ఎమ్మెల్సీలు మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. అధికార వైసీపీ తరఫున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు చిన్న గోవిందరెడ్డి, ఇసాక్ బాషా, పాలవలస విక్రాంత్ ఎమ్మెల్సీలుగా ప్రమాణాలు చేశారు. ఏపీ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు కొత్త ఎమ్మెల్సీల చేత ప్రమాణాలు చేయించారు. కొత్త సభ్యుల రాకతో మండలిలో అధికార వైసీపీ బలం 21కి పెరిగింది.

మరోవైపు ఏపీ అసెంబ్లీలో 151 మందితో తిరుగులేని బలమున్న వైసీపీకి మొన్నటిదాకా మండలిలో చిక్కులు ఎదురైన సంగతి తెలిసిందే. పాత టీడీపీ సభ్యుల గడువు ముగియడంతో స్వల్ప వ్యవధిలోనే 14 మంది కొత్త ఎమ్మెల్సీలు సభలోకి ఎంటరవుతున్నారు. ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు కొత్త ఎమ్మెల్సీలు ఇవాళ ప్రమాణాలు చేశారు. ఈ నెలాఖరులోగా మరో 11 మంది ఎమ్మెల్సీలు.. స్థానిక సంస్థల కోటా నుంచి, అదికూడా వైసీపీ నుంచే సభలోకి అడుగుపెట్టనున్నారు. ఆయా జిల్లాల నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఇప్పటికే నామినేషన్లు వేయడం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్సీలను కలుపుకొంటే, ఈ నెలాఖరులోగా మండలిలో వైసీపీ బలం 32కు పెరగనుంది.