Amalapuram Tension: అమలాపురంలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు దాడులతో ఆ ప్రాంతం అంతా అట్టుడికిపోతోంది. నిరసనకారులు ఏకంగా మంత్రి విశ్వరూప్ ఇంటినే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు. ఇంట్లో ఉన్న మూడు కార్లపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో ఆ కార్లు ధ్వంసం అయ్యాయి. మంటలు ఇంటికంతటికీ వ్యాపించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆందోళనకారుల అటాక్ సమయంలో మంత్రి విశ్వరూప్ ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పోలీసులు, భద్రతా బలగాలు మంత్రిని, ఆయన కుటుంబ సభ్యులను జాగ్రత్తగా అక్కడి నుంచి తరలించారు. ఇక ఆందోళనకారులు ఇంటికి నిప్పు పెట్టడంతో ఇళ్లంతా మంటల్లో దగ్ధమవుతోంది. మంత్రి ఇంటి ముందు ఉన్న వాహనాలకు సైతం నిరసనకారులు నిప్పు పెట్టారు. దాంతో అక్కడ పరిస్థితి రణక్షేత్రాన్ని తలపిస్తోంది. మరోవైపు మంత్రి క్యాంపు కార్యాలయాన్ని కూడా వదల్లేదు ఆందోళనకారులు. క్యాంపు కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్ మొత్తాన్ని ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన పోలీసులపై రాళ్లతో విరుచుకుపడుతున్నారు ఆందోళనకారులు.
మంత్రి స్పందన..
అమలాపురంలో ఉద్రిక్తతలపై మంత్రి విశ్వరూప్ స్పందించారు. ‘చేతులు జోడించి వేడుకుంటున్నా.. సంయమనం పాటించాలి.’ అంటూ ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు మంత్రి విశ్వరూప్. అందరూ శాంతించాలని కోరారు. పేరు మార్పుపై ఏవైనా అభ్యంతరాలుంటే చెప్పాలని, పరిశీలిస్తామని చెప్పారు మంత్రి. తన ఇంటిని తలగబెట్టడం దురదృష్టకరం అన్నారు మంత్రి విశ్వరూప్. అంబేద్కర్ పేరు పెట్టినందుకకు అందరూ గర్వపడాల్సిన అవసరం ఉందన్నారు. కొన్న రాజకీయ క్షుద్ర శక్తులు యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి విశ్వరూప్.