అమెరికాలో కరోనా ‘విలయం’.. సగానికి పైగా రాష్ట్రాలు సతమతం

| Edited By: Anil kumar poka

Mar 08, 2020 | 12:58 PM

అమెరికాలో కరోనా తన ప్రతాపం చూపుతోంది. సగానికి పైగా రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. వాషింగ్టన్ లో మరో ఇద్దరు ఈ వ్యాధికి గురై మరణించారు. దీంతో దేశంలో కరోనాకు గురై మృతి చెందిన వారి సంఖ్య 19 కి పెరగగా..

అమెరికాలో కరోనా విలయం.. సగానికి పైగా రాష్ట్రాలు సతమతం
Follow us on

అమెరికాలో కరోనా తన ప్రతాపం చూపుతోంది. సగానికి పైగా రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. వాషింగ్టన్ లో మరో ఇద్దరు ఈ వ్యాధికి గురై మరణించారు. దీంతో దేశంలో కరోనాకు గురై మృతి చెందిన వారి సంఖ్య 19 కి పెరగగా.. కేవలం న్యూయార్క్ లోనే 89 కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారిన పడిన.. ప్రయాణికులతో కూడిన ఓ నౌక శాన్ ఫ్రాన్సిస్కో రేవులో నిలిచిపోయింది. దేశంలో కోవిడ్-19 కారణంగా ప్రజల దైనందిన జీవితం క్రమంగా స్తంభించిపోయేంత పరిస్థితి కనిపిస్తోంది. సభలు, సమావేశాలు, కాన్ఫరెన్సులు రద్దవుతున్నాయి. విద్యార్థులు, అధ్యాపకులు తమ ఇళ్లలోనే ఉండి ఆన్ లైన్ ద్వారా క్లాసులు తీసుకోవాలని వివిధ యూనివర్సిటీలు కోరుతున్నాయి. ఇప్పటికే ఫ్లోరిడాలో ఇద్దరు కరోనా బాధితులు మరణించిన సంగతి తెలిసిందే. న్యూయార్క్  గవర్నర్ ఏండ్రు క్యూమ్ ఈ సిటీలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.

శాన్ ఫ్రాన్సిస్కో రేవులో నిలిచిపోయిన నౌకలోని 46 మందిలో 19 మంది సిబ్బందికి, ఇద్దరు ప్రయాణికులకు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు తేలింది. వీరిని ఇతరులనుంచి  వేరు చేసి ఐసొలేషన్ కి తరలిస్తున్నట్టు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తెలిపారు.

ట్రంప్ హాజరైన సభలో ఒకరికి కరోనా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ హాజరైన అత్యున్నత రాజకీయ కన్సర్వేటివ్ ల సభలో కరోనా ‘జాడ’ కనిపించింది. ఈ సభలో పాల్గొన్న ఒక వ్యక్తిలో కరోనా లక్షణాలు ఉన్నట్టు వెల్లడైంది. ‘ది కన్సర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్’ పేరిట ఈ అతిపెద్ద సభను  ఇటీవల వాషింగ్టన్ సమీపంలో నిర్వహించారు. ఈ కరోనా బాధితుడిని న్యూజెర్సీలోని ఓ ఆసుపత్రిలో గల ఐసొలేషన్ వార్డుకు తరలించినట్టు అధికారులు తెలిపారు. అయితే ఆ వ్యక్తి…  అధ్యక్షుడు ట్రంప్ తో గానీ, ఉపాధ్యక్షుడు  మైక్ పెన్స్ తో గానీ ఇంటరాక్ట్ కాలేదని వారు చెప్పారు.

‘కరోనానా ? మాకేం భయం ? ట్రంప్

అమెరికాలో మెల్లగా కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. అధ్యక్షుడు ట్రంప్ మాత్రం నిబ్బరంగా ఉన్నారు. ఈ వైరస్ గురించి తామేమీ భయపడడంలేదని, ఇది వ్యాప్తి చెందినా తన ఎన్నికల ప్రచార ర్యాలీలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. కరోనా అదుపునకు తమ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందని ఆయన పేర్కొన్నారు.