Bangladesh Crisis: షేక్ హసీనాకు మరిన్ని కష్టాలు.. ఆశ్రయం కల్పించేందుకు బ్రిటన్ విముఖత..!
బ్రిటన్లో బంగ్లాదేశీయులు భారీ సంఖ్యలో ఉన్నారు. హసీనాకు తమ దేశంలో ఆశ్రయం కల్పిస్తే.. ఆమెకు సరైన రక్షణ కల్పించడం కష్టతరంగా మారుతుందని బ్రిటన్ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఆమెకు తమ దేశంలో ఆశ్రయం కల్పించకూడదని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
![Bangladesh Crisis: షేక్ హసీనాకు మరిన్ని కష్టాలు.. ఆశ్రయం కల్పించేందుకు బ్రిటన్ విముఖత..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/sheikh-hasina-61.jpg?w=1280)
రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్ నుంచి పారిపోయి భారత్కు వచ్చిన ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు కష్టాలు రెట్టింపయ్యాయి. ఆమెకు ఆశ్రయం కల్పించడానికి బ్రిటన్ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. భారత్లో తాత్కాలికంగా ఆశ్రయం లభించడంతో ఆమె అక్కడే ఉంటే మంచిదన్న అభిప్రాయాన్ని బ్రిటన్ దౌత్యవర్గాలు సూచించినట్లు తెలుస్తోంది. షేక్ హసీనా ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్లోని హిండర్ ఎయిర్బేస్ సేఫ్ హౌస్లో ఉన్నారు. గరుడ కమెండోల రక్షణలో ఆమె ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి రఫేల్ విమానాల రక్షణ మధ్య ఆమెను మంగళవారంనాడు భారత్కు తరలించారు.
బ్రిటన్లో బంగ్లాదేశీయులు భారీ సంఖ్యలో ఉన్నారు. హసీనాకు తమ దేశంలో ఆశ్రయం కల్పిస్తే.. ఆమెకు సరైన రక్షణ కల్పించడం కష్టతరంగా మారుతుందని బ్రిటన్ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఆమెకు తమ దేశంలో రాజకీయ శరణార్థిగా ఆశ్రయం కల్పించకూడదని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో షేక్ హసీనా ప్రస్తుతానికి భారత్లోనే ఆశ్రయం పొందే అవకాశమున్నట్లు సమాచారం.
కాగా బంగ్లాదేశ్లో సంక్షోభంపై స్పందించిన బ్రిటన్ ప్రభుత్వం.. గత రెండు వారాలుగా ఆ దేశంలో జరిగిన అల్లర్లు, ప్రాణనష్టంపై ఐరాస నేతృత్వంలో దర్యాప్తు జరపాలని కోరింది. బంగ్లాదేశ్లో ప్రభుత్వ మార్పు శాంతియుతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయంటూ యూకే విదేశాంగ కార్యదర్శి అధికార ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ ప్రకటనలో షేక్ హసీనాకు ఆశ్రయమిచ్చే అంశం గురించి ప్రస్తావించలేదు.
బంగ్లాదేశ్ పార్లమెంటు రద్దు..
కాగా మంగళవారంనాడు బంగ్లాదేశ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లా పార్లమెంట్ను ఆ దేశ అధ్యక్షుడు రద్దు చేశారు. త్వరలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. మరోవైపు షేక్ హసీనా రాజకీయ ప్రత్యర్థి మాజీ ప్రధాని ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు. తాత్కాలిక ప్రభుత్వానికి ఖలీదా నేతృత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలపై ఖలీదా జియాను షేక్ హసీనా ప్రభుత్వం జైల్లో పెట్టింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఖలీదాను షేక్ హసీనా సర్కార్ తీవ్ర వేధింపులకు గురిచేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
పార్లమెంటులో విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన..
కాగా బంగ్లాదేశ్లో నెలకొన్న తాజా పరిస్థితిపై భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయని , ఈ విషయంపై అక్కడి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఢాకా , చిట్టగాంగ్ లోని భారత దౌత్యకార్యాలయాకు రక్షణ కల్పించాలని కోరినట్టు తెలిపారు. తనకు రక్షణ కల్పించాలని మాజీ షేక్ హసీనా కోరడంతో వెంటనే ఆమెకు భారత్లో ఆశ్రయం కల్పించినట్టు తెలిపారు. బంగ్లాలో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపారు.
బంగ్లాదేశ్లో కొనసాగుతున్న విధ్వంసం..
అటు బంగ్లాదేశ్లో విధ్వంసకాండ కంటిన్యూ అవుతోంది. దేశం మొత్తం అల్లర్లలో అట్టుడికిపోతోంది. రిజర్వేషన్ల విషయంలో చెలరేగిన మంటలు… దేశం మొత్తాన్ని తగలబెట్టేస్తున్నాయి. రాజధాని ఢాకాలో పరిస్థితి అత్యంత భయానకంగా మారింది. సైన్యం సైతం ఆందోళనకారుల్ని కంట్రోల్ చేయలేకపోతోంది. ఇప్పటివరకు 400మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 135మంది మృత్యువాత పడ్డారు.
హేక్ హసీనా ప్రభుత్వం కూలిపోగానే బంగ్లాదేశ్ అల్లకల్లోలంగా మారింది. షేక్ హసీనా ఇంటిని ఆందోళనకారులు లూటీ చేశారు. కుర్చీలు, టేబుళ్లు, పూలబొకేలు అన్నిటినీ ఎత్తుకెళ్లిపోయారు. పరుపులు, ఫ్యాన్లు, ల్యాంపులు, ఇలా ఏది కనిపిస్తే అది దోచుకెళ్లారు. బంగ్లా ప్రధాని అధికారిక నివాసం గణభవన్లోనూ లూటీచేశాయి అల్లరిమూకలు. పోలీసులు గానీ, సైన్యం గానీ ఈ అరాచకాన్ని ఆపే ప్రయత్నమే చేయలేదు.