రొమేనియా, జులై 16: యూరప్ దేశాల్లోనే రొమేనియాలో ఎలుగు బంట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో అక్కడ కొన్నేళ్లుగా ఎలుగుబంట్ల దాడులు పెరిగాయి. ఈ క్రమంలో ఇటీవల ఓ యువకుడిపై ఎలుగు బంటి దాడి చేసి హతమార్చడం ఆ దేశంలో సంచలనం రేపింది. వరుస ఎలుగు బంట్ల దాడులవల్ల అక్కడ పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో రొమేనియన్ పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 500 ఎలుగుబంట్లను చంపడానికి రొమేనియా పార్లమెంటు ఆమోదం తెలిపింది. మొత్తం 481 ఎలుగు బంట్లను హతమార్చాలని పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. కాగా గత ఏడాది ఈ యూరోపియన్ దేశం 220 ఎలుగు బంట్లను హతమార్చింది. యూరోపియన్ దేశాల్లో ఎలుగుబంటి జనాభా అధికంగా ఉన్న దేశం రొమేనియా కావడం విశేషం.
రొమేనియా పర్యావరణ శాఖ గణాంకాల ప్రకారం ఆ దేశంలో దాదాపు 8వేలకుపైగా ఎలుగుబంట్లు ఉన్నట్లు అంచనా. దీంతో కొన్నేళ్లుగా స్థానికులపై వీటి దాడులు ఎక్కువ కావడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. గత 20ఏళ్లలో ఏకంగా 26 మంది చనిపోయారు. 274 మంది తీవ్రంగా గాయపడినట్లు ప్రభుత్వం గణాంకాలు వెల్లడించాయి. తాజాగా పర్వతారోహణకు వెళ్లిన 19 ఏళ్ల వ్యక్తిపై దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నేపథ్యంలో రొమేనియా ప్రధాన మంత్రి మార్సెల్ సియోలాకు పార్లమెంట్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చాడు. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
ఈ తరహా దాడులకు వాటి ఎలుగుబంట్ల జనాభా గణనీయంగా పెరగడమే కారణమని తేలింది. అయితే ఈ నిర్ణయాన్ని పర్యావరణ సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం ఖచ్చితమైన పరిష్కారాల వైపు దృష్టి సారించాలి. ఎలుగు బంట్లను చంపడం సరైన నిర్ణయం కాదని వరల్డ్ వైల్డ్లైఫ్ ఫండ్ జీవశాస్త్రజ్ఞుడు కాలిన్ ఆర్డెలీన్ రొమేనియా ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబట్టారు. సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి ఎలుగుబంట్లు కమ్యూనిటీలకు దూరంగా ఉంచడం, వ్యర్థాల సక్రమ నిర్వహణ, జంతువులకు ఆహారం ఇవ్వకుండా నిరోధించడం వంటి చర్యలు అవసరమని WWF రొమేనియా సూచించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.