ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే..ఎంత ఘోరం జరిగేదో..
ఒక్క క్షణం ఆలస్యం జరిగి ఉంటే.. ఆ తల్లి, ఇద్దరు చిన్నారులు కృష్ణానదిలో కలిసిపోయేవారు. కానీ, విజయవాడ పోలీసుల మెరుపు వేగం ఒక కుటుంబాన్ని మృత్యుముఖం నుండి కాపాడింది. ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన ఈ హృదయ విదారక ఘటనలో పోలీసులు చూపిన చొరవ సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.కృష్ణా జిల్లా చిలకలపూడికి చెందిన ఒక మహిళ, కుటుంబ కలహాల కారణంగా మనస్థాపానికి గురైంది. తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఈ బ్రతుకు నావల్ల కాదు, చావే శరణ్యం అని ఇంట్లో చెప్పి విజయవాడకు బయలుదేరింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చిలకలపూడి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు విజయవాడ కంట్రోల్ రూమ్కు సమాచారమిచ్చి అలర్ట్ చేశారు.
సమాచారం అందుకున్న వెంటనే నగర పోలీస్ విభాగం అప్రమత్తమైంది. అప్పటికే ఆ మహిళ ప్రకాశం బ్యారేజీపై పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి సిద్ధమైంది. పరిస్థితిని గమనించిన ట్రాఫిక్ ఆర్.ఎస్.ఐ శ్రీధర్, హెడ్ కానిస్టేబుల్ భూషణం ప్రాణాలకు తెగించి ముందుకు దూకారు. ఆ మహిళను, చిన్నారులను చాకచక్యంగా అదుపులోకి తీసుకుని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. ఆ సమయంలో అక్కడి వాతావరణం అత్యంత ఉద్విగ్నంగా మారింది. క్లిష్ట పరిస్థితుల్లో పోలీసులు చూపిన అప్రమత్తత అభినందనీయం. సమయానికి స్పందిస్తే ఎంతటి విషాదాన్నైనా నివారించవచ్చని ఈ ఘటన నిరూపించిందంటూ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కొనియాడారు. ప్రస్తుతం ఆ ముగ్గురిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. సమయానికి స్పందించి ముగ్గురి ప్రాణాలు కాపాడిన పోలీసులపై నగర ప్రజలు అభినందనలు కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :