అయ్యోపాపం.. నెమలి బావిలో పడి..
అడవిని వదిలి జనవాసాల్లోకి వచ్చిన ఓ నెమలి ప్రమాదవశాత్తు బావిలో పడి ప్రాణాపాయ స్థితికి చేరుకోగా, స్థానిక రైతులు సకాలంలో స్పందించి ఆ పక్షి ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది.గ్రామ శివారులోని ఒక వ్యవసాయ బావిలో జాతీయ పక్షి నెమలి పడిపోవడాన్ని గమనించిన రైతులు, వెంటనే వారంతా కలిసి ఆ మూగజీవిని బయటకు తీశారు. బావిలో నీరు తక్కువగా ఉండటంతో నెమలి తీవ్రంగా గాయపడింది.
వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు గ్రామానికి చేరుకుని నెమలిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం దానిని బసంతనగర్లోని డీర్ పార్కుకు తరలించారు. ప్రస్తుతం ఆ నెమలి కోలుకుంటోందని అధికారులు వెల్లడించారు.అడవులు అంతరించిపోతుండటం, అటవీ ప్రాంతంలో నీటి లభ్యత తగ్గడంతో వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో గ్రామాల శివార్లలో కుక్కలు నెమళ్లపై దాడులు చేస్తున్నాయి. ఆహారం, నీటి కోసం వచ్చి బావుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. గతంలో మల్లాపూర్ మండలంలో విషగుళికలు తిని నెమళ్లు మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి. అడవులను రక్షించి, చెట్లను పెంచడం ద్వారానే వన్యప్రాణులను కాపాడుకోగలం. ఎక్కడైనా వన్యప్రాణులు జనవాసాల్లోకి వస్తే వాటిని హింసించకుండా తమకు సమాచారం అందించాలని, వాటిని సురక్షితంగా పట్టుకుని తిరిగి అడవుల్లో వదులుతామని అటవీశాఖ అధికారులు సూచించారు. మన జాతీయ పక్షి అయిన నెమలికి హాని తలపెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం :