వద్దన్నా వినలేదు.. ఏనుగుకు ఎదురెళ్లాడు.. చివరకు జర్మన్ టూరిస్ట్ పరిస్థితి ఇది!వీడియో

Updated on: Feb 10, 2025 | 5:48 PM

74 ఏళ్ల ఓ వృద్ధ జర్మన్ టూరిస్ట్ సరదాగా బైక్‌ పర్యటనకు కొండ ప్రాంతానికి వచ్చి అనుకోకుండా ప్రమాదంలో పడ్డాడు. ఏనుగులు సంచరించే ప్రాంతం అది. అందుకే ఏనుగు కనిపిస్తే దాటే ప్రయత్నం చేయొద్దని, ఫారెస్ట్‌ గార్డ్‌లు ఎంత హెచ్చరించినా అతను వినలేదు. దారిలో ఏనుగు కనిపిస్తున్నా దాన్ని దాటే ప్రయత్నం చేసి దాని ఆగ్రహానికి గురయ్యాడు. బైక్‌పై ఉన్న టూరిస్ట్‌ను ఏనుగు తొండంతో ఎత్తి పడేసింది. పక్కకు పరిగెత్తిన అతనిపై మరోసారి దాడి చేసింది. ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడి రోడ్డు పక్కనే మృతి చెందిన ఘటన కోయంబత్తూరులో షాక్‌ ఇచ్చింది.

 తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా వాల్పరైలో సరదాగా బైక్‌ రైడ్‌ చేద్దామని బయల్దేరిన మైఖేల్ అనే 73 ఏళ్ల జర్మన్‌ టూరిస్ట్‌కు చేదు అనుభవం ఎదురైంది. మైఖేల్ ద్విచక్ర వాహనంపై పొల్లాచ్చి నుంచి వాల్పరై వెళ్తున్న క్రమంలో ఘోరం జరిగింది. ఆ ప్రాంతం ఏనుగులకు స్థావరం అని, రోడ్డు పక్కన ఆగవద్దని స్థానికులు ఎంత హెచ్చరించినప్పటికీ అతను జాగ్రత్త పడలేదు. దారిలో ఏనుగు కనిపిస్తున్నా, బైక్‌ను కొద్ది దూరం ముందే ఆపకుండా, రయ్ మంటూ దూసుకెళ్లి చావు కొనితెచ్చుకున్నాడు. మైఖేల్ ఏనుగును దాటే క్రమంలో అది.. బైక్‌పై ఉన్న అతని మీదకు దూసుకెళ్లి, అతన్ని వాహనం నుంచి కింద పడేసింది. దీంతో అతను తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నంలో మెల్లగా లేచి రోడ్డువైపుగా వచ్చాడు. ఆ క్రమంలో అక్కడే ఉన్న ఏనుగు మరోసారి అతనిపై దాడికి పాల్పడింది. ఆపై అతనిని తీవ్రంగా గాయపరిచింది. ఏనుగు దాడిలో తీవ్ర గాయాలతో మైఖేల్ అక్కడే కుప్పకూలిపోయాడు. అతనికి శ్వాస అందకపోవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు విచారణ చేపట్టారు.