నాడు మున్సిపల్ కార్మికురాలు.. నేడు అదే మున్సిపాలిటీలో కౌన్సిలర్
కృషి, పట్టుదల ఉంటే సామాన్యులు కూడా అసామాన్యులుగా ఎదగగలరని నేరేడుచర్లకు చెందిన వెంకటమ్మ నిరూపించారు. మూడు దశాబ్దాల పాటు ఏ మున్సిపాలిటీ వీధులను ఆమె శుభ్రం చేశారో, ఇప్పుడు అదే మున్సిపాలిటీలో ప్రజాప్రతినిధిగా అడుగుపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు. వెంకటమ్మ మొదట నేరేడుచర్ల గ్రామ పంచాయతీలో, ఆ తర్వాత మున్సిపాలిటీలో సఫాయి కార్మికురాలిగా సుమారు 30 ఏళ్ల పాటు పనిచేశారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా, అధికారుల ఆదేశాల మేరకు అంకితభావంతో తన విధులను నిర్వర్తించారు.
2019 డిసెంబర్లో ఆమె ఉద్యోగ విరమణ పొందారు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఖాళీగా కూర్చోకుండా, స్థానిక ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అందరికీ ఆత్మీయురాలిగా మారారు.వెంకటమ్మకు ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డు నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. బిఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగిన ఆమె, హోరాహోరీ పోరులో తన సమీప ప్రత్యర్థిపై 10 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నిన్నటి వరకు మున్సిపల్ ఆఫీసులో కార్మికురాలిగా సంతకం పెట్టిన ఆమె, ఇప్పుడు అదే కార్యాలయంలో కౌన్సిలర్గా నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగారు. ఈ సందర్భంగా వెంకటమ్మ ఏం చెప్పారో తెలుసా…తాను పని చేసిన చోటే తనను గౌరవించి గెలిపించిన వార్డు ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. కార్మికుల కష్టాలు, వార్డు సమస్యలు తనకు తెలుసని, ప్రజా సేవకురాలిగా తన శక్తి మేరకు పని చేస్తానని వెంకటమ్మ అన్నారు. సామాన్య సఫాయి కార్మికురాలి నుంచి కౌన్సిలర్గా ఎదిగిన వెంకటమ్మ ప్రయాణం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది.
మరిన్ని వీడియోల కోసం :
