Watch: పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ.. సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Updated on: Aug 15, 2025 | 6:48 PM

Pulivendula ZPTC Results: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ వైసీపీ అధినేత జగన్‌తో పాటు ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. పులివెందులలో టీడీపీ విజయంపై స్పందిస్తూ.. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు.

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం తెలిసిందే. అయితే ఈ ఎన్నికలపై వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారంనాడు కౌంటర్ ఇచ్చారు. 79వ స్వాతంత్ర్య దినం సందర్భంగా పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. 30 ఏళ్ల తర్వాత ఓటు వేశానంటూ ఒకరు బ్యాలెట్‌లో స్లిప్ వేశారు.. వైఎస్ వివేకాకు న్యాయం చేయాలని పులివెందుల ప్రజలు కోరుతున్నారనే విషయాన్ని గుర్తుచేశారు. కొంత మంది కరుడుగట్టిన నేరస్తులు రాజకీయ ముసుగులో తిరుగుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక్కడ ఉన్నది 2014 సీబీఎన్ కాదు, 1995 సీబీఎన్ అన్నారు. నేరాలు చేసి తప్పించుకోవాలని చూస్తే వదిలిపెట్టబోనంటూ చంద్రబాబు హెచ్చరించారు.