దసరాకు శూర్పణఖ దహనం..ప్రియుడి కోసం పిల్లలు, భర్తలను చంపిన భార్యల ఫొటోలతో .. – TV9

Updated on: Sep 21, 2025 | 4:43 PM

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఏడాది దసరా వేడుకల్లో రావణుడి బొమ్మను కాకుండా సూర్పణఖ బొమ్మను దహనం చేయనున్నారు. పౌరుష సంస్థ అనే పురుష హక్కుల సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, ప్రియుడి కోసం భర్తలను చంపిన స్త్రీల ఫోటోలను సూర్పణఖ బొమ్మకు అతికించనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వివాదాలకు దారితీస్తోంది.

ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంగా భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో రావణ దహనం వేడుకలు వైభవంగా జరుగుతాయి. ఢిల్లీలోని రాంలీల మైదానంలో జరిగే రావణ దహనం అత్యంత ప్రసిద్ధి చెందింది. కానీ ఈ ఏడాది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో దసరా వేడుకలు వినూత్న మలుపు తిరుగుతున్నాయి. పౌరుష అనే పురుష హక్కుల సంస్థ రావణుడి బొమ్మను కాకుండా సూర్పణక బొమ్మను దహనం చేయాలని నిర్ణయించింది. ఈ సంస్థ వారు సూర్పణఖను స్త్రీలలోని దుష్టత్వానికి ప్రతీకగా చూపుతున్నారు. ఈ కార్యక్రమాన్ని “అధర్మ” అనే పేరుతో నిర్వహించనున్నారు. సూర్పణక బొమ్మకు 10 తలలు ఏర్పాటు చేసి, ప్రియుడి కోసం భర్తలను లేదా పిల్లలను హత్య చేసిన స్త్రీల ఫోటోలను అతికించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలలో సోనమ్ రఘువంశి వంటి వ్యక్తుల ఫోటోలు కూడా ఉండే అవకాశం ఉంది. సోనమ్ రఘువంశి తన భర్త రాజా రఘువంశిని హత్య చేయడానికి తన ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. మే 20న హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్ళి, మే 22న హత్య చేయించింది.