Telangana: ఆహా.. ఇది కదా కావాల్సింది.. రాష్ట్రంలో వచ్చే 5 రోజులు వర్షాలే
తెలంగాణలో భానుడు నిప్పులు కురిపిస్తోన్న వేళ హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రజలకు కూల్ న్యూస్ అందించింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఎండలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ కూల్ న్యూస్ చెప్పింది. రాగల ఐదు రోజులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మరో వైపు పలు జిల్లాల్లో వడగాలులు కొనసాగుతాయని పేర్కొంది. దాంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఆదివారం ఖమ్మం, కొత్తగూడెం, నాగర్ కర్నూల్ సూర్యాపేట, జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది. సోమవారం ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, , మహబూబాబాద్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. అలాగే ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల,జగిత్యాల, నిర్మల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది.
మంగళవారం భువనగిరి, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఖమ్మం, కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం నుంచి గురువారం వరకు పలు చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం పలుచోట్ల వర్షం కురిసింది. జనగామ, ములుగు జిల్లాల్లో వడగళ్ల వాన పడింది. ఏటూరు నాగారంలో పిడుగుపాటుకు రైతు మృతి చెందాడు. కోడూరులో పిడుగుపాటుతో రైతు అజయ్ మృత్యువాతపడ్డాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…