TS Rythu Bandhu: ఆకలికేకల తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారింది.. రైతు బంధే కారణం అంటున్న మంత్రి నిరంజన్ రెడ్డి..

|

Jun 19, 2021 | 4:25 PM

TS Rythu Bandhu: ఆకలికేకల తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

TS Rythu Bandhu: ఆకలికేకల తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారింది.. రైతు బంధే కారణం అంటున్న మంత్రి నిరంజన్ రెడ్డి..
Minister Niranjan Reddy
Follow us on

TS Rythu Bandhu: ఆకలికేకల తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన మంత్రి నిరంజన్ రెడ్డి.. రైతు బంధు సహా రాష్ట్రంలో పంట దిగుబడి, కొనుగోళ్లు తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆవిర్భావ సమయంలో 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములను 29.26 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచడం జరిగిందని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని గోదాములతో పాటు రైతు వేదికలు, కాటన్ మిల్లులు, అవకాశం ఉన్న ప్రతిచోటా ధాన్యం నిలువచేయడం జరిగిందన్నారు. వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన ప్రాధాన్యత మూలంగానే ఇది సాధ్యం అయిందన్నారు. ధాన్యం కొనుగోళ్ల గురించి విమర్శలు చేసే విపక్షాలు ముందు ఇంత ఉత్పత్తి ఎలా సాధ్యమయిందో అర్ధం చేసుకుని మాట్లాడాలి హితవుచెప్పారు. 2014 – 15 లో వానాకాలం, యాసంగి కలిపి 24.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే కేవలం 2021 ఈ యాసంగి లోనే 90.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందని మంత్రి వెల్లడించారు.

ఇదిలాఉంటే.. రైతు బంధు విడుదలపైనా మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 54.37 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ. 5,145.87 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. ఐదవ రోజు 4.90 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.1,050.10 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. మొత్తం 102.92 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం అందించడం జరిగిందని మంత్రి వెల్లడించారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు 3,97,260 మంది రైతులకు రూ.401.92 కోట్లు విడుదల చేశామన్నారు. అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 27,819 మంది రైతులకు రూ.19.68 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. ఇక నల్గొండ తర్వాత నాగర్ కర్నూలు జిల్లాలో అత్యధికంగా 2,35,549 మంది రైతులకు రూ.254.62 కోట్లు, మూడోస్థానంలో సంగారెడ్డి జిల్లా 2,66,797 మంది రైతులకు రూ.247.67 కోట్లు రైతుబంధు సాయం అందించడం జరిగిందన్నారు. రైతుబంధు సాయంతో రాష్ట్రంలో అనూహ్యంగా సాగు విస్తీర్ణం పెరిగిందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో వస్తున్న పంటల దిగుబడే దీనికి నిదర్శనం అని అన్నారు.

Also read:

IND Vs NZ, WTC Final 2021 Day 2 Live: రెండవ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా.. క్రీజులో రోహిత్-శుభ్‌మన్‌గిన్..