TRSను భారత రాష్ట్రసమితిగా మార్చిన తర్వాత తొలిసారి ఢిల్లీ వచ్చిన సీఎం కేసీఆర్ పార్టీ కార్యాలయం కోసం తీసుకున్న భవనాన్ని సందర్శించారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులోని నివాసం నుంచి సీఎం కేసీఆర్ – సర్దార్ పటేల్ రోడ్డులోని కొత్త కార్యాలయ భవనానికి వచ్చారు. రెండంతస్తుల ఈ భవనంలో ప్రస్తుతం కొన్ని మరమత్తులు జరుగుతున్నాయి. ఈ భవనంలోని అన్ని గదులు, ఛాంబర్లను సీఎం పరిశీలించారు. ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులోని ఐదో నెంబర్ ఇంటిని BRS అద్దెకు తీసుకుంది. ఏడాది కాలానికి ఈ భవనాన్ని లీజుకు తీసుకున్నట్టు సమాచారం. ఢిల్లీలోని వసంత విహార్ ప్రాంతంలో తెలంగాణ భవన్ నిర్మాణం జరుగుతోంది. అది పూర్తయ్యేందుకు ఒక సంవత్సరం పడుతుందని అంచనా. అంత వరకు ఈ అద్దె భవనం నుంచే BRS కార్యకలాపాలు నిర్వహించనుంది. ఎన్నికల సంఘం నుంచి BRSకు అనుమతి రాగానే ఈ కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. సొంత భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు ఈ అద్దె భవనం నుంచే BRS కార్యకలాపాలు సాగనున్నాయి. అది పూర్తయ్యేందుకు కొంత సమయం పడుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. దాదాపు ఏడాది పాటు ఈ అద్దె భవనం నుంచి కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉండటంతో పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ కొన్ని మార్పులు, చేర్పులు సూచించినట్టు తెలుస్తోంది. ఎక్కడ ఏ ఏర్పాట్లు చేయాలనే దానిపై పార్టీ నేతలకు కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం.
అంతకు ముందు ఆయన ఉత్తరప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామం సైఫాయ్లో ములాయం పార్థీవ దేహానికి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, సీఎం కేసీఆర్ ఈ వారం వరకు ఢిల్లీలోనే ఉంటారని, ఈ సందర్భంగా పలు పార్టీలతో జాతీయ రాజకీయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..