గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్ అయింది. పరీక్ష వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేశారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించింది. ఫలితాలు వెల్లడించడానికి ముందే తుది తీర్పు ఇవ్వాలని హైకోర్టుకి సుప్రీం ధర్మాసనం సూచించింది. గ్రూప్ వన్ అభ్యర్థుల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు.
పరీక్ష కేంద్రాల దగ్గర కట్టుదిట్టంగా భద్రత
మొత్తం 46 పరీక్షా కేంద్రాల్లో సోమవారం గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. మొత్తం 31వేల 383 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు అవుతున్నారు. పరీక్షా కేంద్రాల దగ్గర పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 12.30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించారు. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత గేట్లు క్లోజ్ చేశారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా గంట అదనపు సమయం కేటాయించారు. పరీక్షలు నిర్వహించే రోజుల్లో అన్ని కేంద్రాలకూ ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడపుతుంది.
గ్రూప్ 1 పరీక్షపై వివాదం ఏంటి..?
గ్రూప్ 1 పరీక్ష ఇంత వివాదాస్పదం అవడానికి ప్రధాన కారణాలు రెండు.. అందులో మొదటిది జీవో 29 అయితే రెండోది సమయాభావం.
2022లో గ్రూప్-1 పరీక్ష కోసం జీవో 55 తీసుకొచ్చింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే.. ఆ నోటిఫికేషన్ను రద్దు చేసి జీవో 29 తీసుకొచ్చి పరీక్ష నిర్వహిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. ప్రిలిమ్స్ అయ్యాక 1:50 నిష్పత్తిలో మెయిన్స్కు సెలెక్ట్ చేయడానికి తీసుకొచ్చిందే జీవో 29. అంటే.. ఒక్కొక్క పోస్టుకు 50 మందిని మెయిన్స్కు సెలెక్ట్ చేస్తారు. కాని, ఇక్కడే సమస్య వచ్చింది. పోస్టులను బట్టి 1:50 నిష్పత్తిని ఉపయోగిస్తారా.. లేక రిజర్వేషన్లను బట్టి 1:50 నిష్పత్తా అనే దాంట్లో క్లారిటీ మిస్ అయిందంటున్నారు. ఈ జీవో 29పై పెద్ద రాద్ధాంతమే జరుగుతోందిప్పుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. జీవో 29 కారణంగా రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్ధులకు అన్యాయం జరుగుతుందనేది నిరుద్యోగుల వర్షన్.