Jagadish Reddy: వారికి నిద్రపట్టక షెడ్యూల్‌ విడుదల చేశారు.. మునుగోడులో TRS గెలుపు ఖాయం: మంత్రి జగదీష్‌రెడ్డి

|

Oct 03, 2022 | 6:08 PM

మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్‌ పెంచేసింది. బైపోల్‌కు తాము రెడీ అంటూనే బీజేపీపై విమర్శలు గుప్పించారు మంత్రి జగదీష్‌ రెడ్డి

Jagadish Reddy: వారికి నిద్రపట్టక షెడ్యూల్‌ విడుదల చేశారు.. మునుగోడులో TRS గెలుపు ఖాయం: మంత్రి జగదీష్‌రెడ్డి
Minister Jagadish Reddy
Follow us on

మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్‌ పెంచేసింది. బైపోల్‌కు తాము రెడీ అంటూనే బీజేపీపై విమర్శలు గుప్పించారు మంత్రి జగదీష్‌ రెడ్డి. కేసీఆర్‌ జాతీయ రాజకీయ పార్టీ ప్రకటన చేయగానే.. హడావుడిగా షెడ్యూల్‌ విడుదల చేశారన్నారు. ఎప్పుడో రావాల్సిన నోటిఫికేషన్‌ను ఓటమి భయంతోనే ఆలస్యం చేశారని ఆరోపించారు. దేశ ప్రజలు సీఎం కేసీఆర్‌ నాయకత్వం కోరుకుంటున్నారని వివరించారు. ఈ మేరకు మంత్రి జగదీశ్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ బై పోల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నారంటూ జోస్యం చెప్పారు. నిత్యావసరాల ధరలు పెంచి, రైతులకు మీటర్లు పెడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న కేసీఆర్‌ను ఓడించడం ఎవరి వల్ల కాదంటూ చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి దేశ ప్రజలందరూ చర్చించుకుంటున్నారని జగదీశ్ రెడ్డి వివరించారు. తెలంగాణలో ఉన్న పథకాలను తమకు కూడా అందించాలని ప్రధాని మోడీని అడుగుతున్నారని వివరించారు. సరికొత్త అభివృద్ధి నమూనాతో వస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నిన్నటి కేసీఆర్ సమావేశాన్ని చూసిన తర్వాత మోదీ అమిత్ షాలకు నిద్రపట్టలేదని.. అందుకే హడావుడిగా మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేశారని ఎద్దేవా చేశారు.

బీజేపీ దుష్టపన్నాగానికి ప్రజలు చెక్‌ పెడతారని మంత్రి తెలిపారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉంటుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతామని జగదీష్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..