హస్తం పార్టీలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలైంది.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి.. మొదట్లో ముగ్గురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా.. ఇటీవల మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి.. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.. అయితే.. కేసీఆర్ కుటుంబానికి సాన్నిహిత్యంగా ఉండే వారే పార్టీను వీడుతుండటం.. ప్రస్తుత ఫిరాయింపు రాజకీయ పరిస్థితులపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. చరిత్ర పునరావృతం అవుతుంది… అంటూ కాంగ్రెస్ ప్రోత్సహిస్తున్న పార్టీ ఫిరాయింపుల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్నామని వీర్రవీగుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని కాంగ్రెస్ కు హెచ్చరించారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల శక్తి ఎప్పుడు అధికారంలో ఉన్నవారి కన్నా కూడా బలంగా ఉంటుందని కేటీఆర్ అన్నారు.. 2004-06 సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సార్లు పార్టీ ఫిరాయింపులకు పాల్పడింది. అప్పుడు కూడా బీఆర్ఎస్ ఇబ్బందులను ఎదుర్కొంది. ఇలాంటి కష్టసమయాలు బీఆర్ఎస్ కు కొత్త కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ నీతి లేని వ్యవహారాలపై తెలంగాణ ప్రజలు ఆందోళనను ఉధృతం చేశారు. ఈ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ తల వంచక తప్పలేదన్నారు. ప్రస్తుతానికి తమ పార్టీ ఎమ్మెల్యేల ను ఫిరాయింపులకు పాల్పడేందుకు ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మళ్లీ కచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారు. చరిత్ర పునరావృతం అవుతుంది.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
The power of people is always stronger than the people in power
We have faced several defections of MLAs in the past in 2004-06 when Congress was in Government
Telangana responded strongly by stepping up the people’s agitation & eventually Congress had to bow its head…
— KTR (@KTRBRS) June 24, 2024
బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పందించారు. పార్టీలో చేరికల మీద బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మట్లాడుతున్నారు.. భట్టి.. ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసింది మీరు కాదా..? అంటూ ప్రశ్నించారు. శాసనమండలిలో నా ప్రతిపక్ష నేత హోదా మీరు తొలగించలేదా..? అంటూ ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను చేర్చుకుంది మీరు కాదా..? అంటూ పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లలో డిపాజిట్ పోయిందని ..ఇప్పుడు అనర్హత వేటు గురించి మట్లాడుతున్నారంటూ షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు.
కాగా.. పార్టీ ఫిరాయింపులతో తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.. ఇప్పటివరకు కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరింది. హస్తం పార్టీలో చేరిన వారిలో దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్రెడ్డి, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, సంజయ్ ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..