తెలంగాణలో పార్లమెంట్ పోరు.. పతాకస్థాయికి చేరుకుంది. ఇప్పటికే అసెంబ్లీ గెలుపుతో ఊపుమీదున్న కాంగ్రెస్.. అదే జోష్ని కంటిన్యూ చేయాలనుకుంటోంది. ఓట్లు, సీట్లు రెండింటినీ పెంచుకుని హుషారుగా ఉన్న కమలదళం కూడా.. ఏమాత్రం తగ్గేదేలే అంటోంది. పదేళ్ల తర్వాత అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్న బీఆర్ఎస్ కూడా.. ఢిల్లీ లెవెల్లో గల్లీ వాయిస్ వినిస్తామంటోంది. ప్రత్యర్థులపై సమరశంఖం పూరిస్తోంది. అందరి టార్గెట్ డబుల్ డిజిట్టే.. మరి ఆ టార్గెట్ను రీచ్ అయ్యేదెవరు? ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది.
సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. తెలంగాణలో రాజకీయం అంతకంతకూ వేడెక్కుతోంది. మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. డబుల్ డిజిట్ సాధించేందుకు దేనికవే వ్యూహప్రతివ్యూహాలతో జనాల్లోకి వెళ్తున్నాయి. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. తుక్కుగూడ సభతో ఇప్పటికే జంగ్ సైరన్ మోగించింది. 14 ఎంపీ సీట్లే లక్ష్యంగా పనిచేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ క్యాడర్కు పిలుపునివ్వగా.. 12 ఎంపీ స్థానాలు కచ్చితంగా గెలిచి తీరుతామంటున్నారు మంత్రి శ్రీధర్బాబు. గతంతో పోలిస్తే ఓట్లు, సీట్ల పరంగా తెలంగాణలో బాగా మెరుగుపడిన భారతీయ జనతా పార్టీ.. ఈసారి తెలంగాణలో డబుల్ డిజిట్ కొట్టాల్సిందే అంటోంది. 12 ఎంపీ స్థానాల్లో గెలిచి తీరుతామంటున్నారు కమలనాథులు. ఇండియన్ పొలిటికల్లీగ్లో బీజేపీదే విజయమంటున్న బండి సంజయ్… తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్లను డకౌట్ చేస్తామంటున్నారు.
బీఆర్ఎస్ కూడా తగ్గేదేలె అంటోంది.. అసెంబ్లీ ఓటమిని లెక్కచేయకుండా జాతీయ పార్టీలకు ధీటుగా పార్లమెంటుకు సిద్ధమంటోంది. చేవెళ్లలో ఎన్నికల శంఖారావం పూరించి.. సమరానికి సై అంటోంది. 12కు తగ్గకుండా ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే, ఒక్కసారిగా జోష్లోకి వచ్చిన కాంగ్రెస్, బీజేపీలు.. కారు పార్టీకి సైడిస్తాయా? అన్నదే పొలిటికల్గా చర్చనీయంశమవుతోంది. బలంగా మారిన జాతీయ పార్టీలను తట్టుకుని.. బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంకుంటుందా? చేవెళ్ల శంఖారావంతో పడిలేచిన కెరటంలా ఎగిసిపడుతుందా? చూడాలి.