బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా మాట్లాడుతున్న కూతురు.. సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తల్లి.. కట్ చేస్తే.!

| Edited By: Ravi Kiran

Mar 19, 2024 | 1:41 PM

ఇబ్రహీంపట్నం దండుమైలారంలో దారుణం జరిగింది. చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా చూసుకున్న కన్నకూతురిని కనికరం లేకుండా కన్నతల్లే నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కన్న కూతురు ప్రేమ వ్యవహారం నడుపుతోందని..

బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా మాట్లాడుతున్న కూతురు.. సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తల్లి.. కట్ చేస్తే.!
Representative Image
Follow us on

ఇబ్రహీంపట్నం దండుమైలారంలో దారుణం జరిగింది. చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా చూసుకున్న కన్నకూతురిని కనికరం లేకుండా కన్నతల్లే నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కన్న కూతురు ప్రేమ వ్యవహారం నడుపుతోందని.. తాను చెప్పిన మాట వినడం లేదని తల్లే కూతురును హత్య చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. స్థానిక దండుమైలారంలో నివాసముంటున్న మోతే జంగమ్మ, ఐలయ్యలకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు కాగా, ఒక కుమార్తె ఉంది. ఒక్కగానొక్క కుమార్తె పేరు భార్గవి(20). ఇటీవల భార్గవిని బంధువుల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. అయితే దిల్‌సుఖ్‌నగర్‌లోని  అనిబిసెంట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న భార్గవి అదే గ్రామానికి చెందిన శశి అనే యువకుడ్ని ప్రేమించింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో ఆమెను గత రెండు వారాలుగా తల్లిదండ్రులు కాలేజీకి పంపించడం లేదు. ఇదిలా ఉంటే.. ఈ సోమవారం భార్గవి ఇంట్లో ఎవరూ లేరని తెలియడంతో.. అక్కడికి వెళ్లాడు శశి. లవర్స్ ఇద్దరూ కూడా ఏకాంతంగా మాట్లాడుకుంటుండగా.. తల్లి జంగమ్మ వారిని గమనించింది.

వారిద్దరిపై కోపంతో ఊగిపోయింది. తాను ఎన్నిసార్లు మందలించినా.. తన మాట వినట్లేదని ఆగ్రహించిన తల్లి.. కిటికీకి చున్నితో కూతుర్ని ఉరివేసి చంపేసింది. అదే సమయంలో ఇంటికి వచ్చిన సోదరుడు చరణ్ తన సోదరిని తల్లి చంపిన విధానాన్ని చూసి.. అదే అంశాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు.. హత్యకు గల కారణాలతో పాటు తల్లి హత్య చేసిందా అనే దానిపై దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు.