దళితుల సామాజిక ఆర్థిక సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం దళిత బంధు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఏడాది జూలైలో సీఎం కేసీఆర్ ప్రయోగాత్మకంగా ఈ సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని సంతృప్త పద్ధతిలో అమలుచేయడంతో ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే దాదాపు 15,402 దళిత కుటుంబాలు లబ్ధి పొందాయి. ఆ తర్వాత మధిర, తుంగతుర్తి, అచ్చంపేట, జుక్కల్ నియోజకవర్గాల్లో కూడా వేలాదిమంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. ఈ ఏడాది నవంబర్ 20 వరకు రాష్ట్రంలో 31,000కు పైగా అర్హత కలిగిన కుటుంబాలు దళితబంధు పథకం ద్వారా లబ్ధి పొందాయి. కాగా ఈ సంక్షేమ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల సంఖ్యను పెంచడంతో పాటు నిధులను కూడా భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కాగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో అర్హులైన 2.82 లక్షల మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకాన్ని వర్తింపజేయనుంది ప్రభుత్వం. ఈ పథకం అమలుకు 2021-22లో రూ.3,100 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది ఏకంగా రూ.17,700 కోట్లను కేటాయించింది. ఈ పథకం కింద, అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి బ్యాంకు లింకేజీ లేకుండా రూ.10 లక్షలను గ్రాంట్గా అందజేస్తారు. లబ్ధిదారులు తమ సొంత కాళ్లపై నిలబడేందుకు, వారి జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..