కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో జరిగిన రచ్చ పోలీసు ఫిర్యాదుల దాకా వెళ్లింది. సీఈవో వర్సెస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి మధ్య జరిగిన గొడవపై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. జిల్లా సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ను అడ్డుకున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై జెడ్పీ సీఈవో ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు కేసు నమోదు చేశారు. BNS చట్టం అమల్లోకి వచ్చిన రెండో రోజే ఎమ్మెల్యేపై కేసు నమోదైంది.
కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో కలెక్టర్ను అడ్డుకున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదయింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తమ విధులకు ఆటంకం కలిగించారని ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీసులు ప్రభుత్వ అధికార యంత్రాంగం విధులకు ఆటంకం కలిగించిన సెక్షన్లలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. బారత్ న్యాయ్ సంహిత యాక్ట్ సెక్షన్ 221, 126 (2)లో ఈ కేసు నమోదు చేశారు. భారత దేశంలో బీఎన్ఎస్ యాక్టు అమల్లోకి వచ్చిన రెండో రోజు చట్టసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రతినిధిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. దేశంలోనే కొత్త చట్టాల మేరకు కేసు నమోదు అయిన వ్యక్తిగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రికార్డుల్లోకి ఎక్కారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో విద్యారంగంపై నిర్వహించిన.. మీటింగ్కు హాజరైన MEOలను..డీఈఓ ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో ఆ డీఈఓను వెంటనే సస్పెండ్ చేయాలని జెడ్పీ సమావేశంలో కలెక్టర్ను పట్టుబట్టారు కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డి ఆందోళనతో జెడ్పీ మీటింగ్ గందరగోళంగా మారింది. దీంతో కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు.
తప్పు చేసిన డీఈవోపై చర్యలు తీసుకోవాలని కోరితే.. కలెక్టర్ సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారని కౌశిక్ రెడ్డి అన్నారు. కౌన్సిల్ సమావేశంలో ప్రశ్నించడం తన హక్కని, కానీ ప్రభుత్వం కేసులు పెట్టి తన గొంతు నొక్కాలని చూస్తోందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ సమావేశంలో తనతోపాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను జెడ్పీ సీఈఓ అడ్డుకున్నారని కరీంనగర్ సీపీని కలిసి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
కౌశిక్రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టడంపై బీఆర్ఎస్ స్పందించింది. కౌశిక్ రెడ్డిపై కేసు పెట్టడం దారుణమని.. ప్రశ్నించే గొంతులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామని హరీష్రావు ట్వీట్ చేశారు. ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తున్నందుకే కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు పెడుతున్నారని.. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదని కేటీర్ ప్రకటించారు. మరోవైపు ఎన్ని కేసులు నమోదు చేసిన ప్రభుత్వం పై పోరాటం అగదని కౌషిక్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..