రాష్ట్ర ప్రభుత్వం సరైన దిశలోనే వెళ్తోంది: హైకోర్టు

రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం చాలా కష్ట పడుతోందని కితాబు ఇచ్చింది హైకోర్టు. తెలంగాణలో కరోనా పరీక్షలు, చికిత్సలపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వం సరైన దిశలోనే వెళ్తోంది: హైకోర్టు
Follow us

|

Updated on: Aug 13, 2020 | 4:55 PM

రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం చాలా కష్ట పడుతోందని కితాబు ఇచ్చింది హైకోర్టు. తెలంగాణలో కరోనా పరీక్షలు, చికిత్సలపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా పరీక్షలు జరుపుతున్న తీరును, పాజిటివ్ వచ్చినవారికి అందిస్తున్న చికిత్సలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈనెల 3 నుంచి సుమారు 42వేల మంది సెకండరీ కాంటాక్టులకు కరోనా పరీక్షలు నిర్వహించామని నివేదికలో తెలిపింది.

మరోవైపు, దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రయత్నం తప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని విమర్శించాలనేది తమ ఉద్దేశం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. చిన్న చిన్న లోపాలను సరిదిద్దాలనేది తమ ప్రయత్నమని కోర్టు స్పష్టం చేసింది. కరోనా యోధులు తమ వ్యాఖ్యలను అపార్థం చేసుకోవద్దని కోర్టు వ్యాఖ్యానించింది. కరోనాకు ముందుండి పోరాడుతున్న అధికారులను నైతిక స్థైర్యం దెబ్బ తీయాలనే ఉద్దేశం తమకు లేదన్న కోర్టు.. ప్రజలకు మెరుగైన వైద్యం అందన్న ఉద్దేశ్యంతోనే సూచనలు చేయడం జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది.

హోటళ్లలో ఐసోలేషన్‌ పడకలు 857 నుంచి 2,995కి పెరిగాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. జిల్లాల్లో 86 కొవిడ్‌ కేంద్రాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడ్మిషన్ల ప్రక్రియ సులభతరమైంది. ప్రైవేటు ఆసుపత్రులపై 50 ఫిర్యాదులు వచ్చాయి. 46 ఆసుపత్రులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చాం. షోకాజ్‌ నోటీసులకు 16 ఆసుపత్రులు వివరణ ఇచ్చాయి. బులిటెన్‌లో గందరగోళం లేకుండా చర్యలు తీసుకున్నామని సీఎం కోర్టుకు నివేదించారు. కరోనా మృతదేహాల కోసం 61 వాహనాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించిన ప్రైవేట్ ఆస్పత్రుల లీజులు రద్దు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.

చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని తెలిపింది. కొంతమంది ఎన్జీఓలు సివిల్‌ సొసైటీతో కలిసి ఐసోలేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి రసూల్‌పూర్‌లోని హాకీ మైదానాన్ని పరిశీలించాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 4కు వాయిదా వేసిన కోర్టు.. వైద్య శాఖ అధికారులు హాజరు కావాలని ఆదేశించింది.