Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళనలో కీలక మలుపు.. బ్రిజ్‌భూషణ్‌పై ఛార్జ్‌షీట్‌.. పహిల్వాన్లపై కేసులు ఎత్తివేత..

|

Jun 08, 2023 | 8:00 AM

కేంద్రం ఇచ్చిన హామీతో ఈనెల 15వ తేదీ వరకు ఆందోళనలు నిలిపివేస్తునట్టు రెజ్లర్‌ భజరంగ్‌ పునియా ప్రకటించారు. పలు అంశాలపై కేంద్రమంత్రితో చర్చించినట్టు చెప్పారు. బ్రిజ్‌భూషణ్‌పై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ఈ నెల 15నాటికి పూర్తవుతుందని.. ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తారని అనురాగ్‌ ఠాకూర్‌ హామీ ఇచ్చినట్టు తెలిపారు. రెజ్లర్లపై నమోదు చేసిన కేసులు కూడా ఎత్తేస్తామని హామీ ఇచ్చారు

Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళనలో కీలక మలుపు.. బ్రిజ్‌భూషణ్‌పై ఛార్జ్‌షీట్‌.. పహిల్వాన్లపై కేసులు ఎత్తివేత..
Union Minister Anurag Thakur
Follow us on

రెజ్లర్ల ఆందోళన కీలక మలుపు తిరిగింది. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన పహిల్వాన్లతో కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సమావేశమయ్యారు. దాదాపు 6గంటల పాటు జరిగిన చర్చల్లో కీలక పురోగతి సాధించారు. రెజ్లర్లకు కేంద్రమంత్రి లిఖితపూర్వంగా పలు హామీలు ఇచ్చినట్టు తెలుస్తోంది. కేంద్రం ఇచ్చిన హామీతో ఈనెల 15వ తేదీ వరకు ఆందోళనలు నిలిపివేస్తునట్టు రెజ్లర్‌ భజరంగ్‌ పునియా ప్రకటించారు. పలు అంశాలపై కేంద్రమంత్రితో చర్చించినట్టు చెప్పారు. బ్రిజ్‌భూషణ్‌పై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ఈ నెల 15నాటికి పూర్తవుతుందని.. ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తారని అనురాగ్‌ ఠాకూర్‌ హామీ ఇచ్చినట్టు తెలిపారు. రెజ్లర్లపై నమోదు చేసిన కేసులు కూడా ఎత్తేస్తామని హామీ ఇచ్చారు. ‘కేంద్రంతో చర్చలు మంచి వాతావరణంలో జరిగాయి. ఈనెల 15వ తేదీ లోగా దర్యాప్తు పూర్తి చేస్తామని క్రీడా శాఖ మంత్రి హామీ ఇచ్చారు. అప్పటివరకు ఆందోళనలు ఆపేయాలని కోరారు. రెజ్లర్లకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు . మాపై పెట్టిన కేసులు ఉపసంహరిస్తామని కూడా చెప్పారు’ అని బజరంగ్‌ పూనియా చెప్పుకొచ్చాడు.

ఆందోళనలకు తాత్కాలిక విరామం..

మరోవైపు రెజ్లర్లతో దాదాపు 6గంటల పాటు చర్చలు జరిగాయని కేంద్రమంత్రి అనురాగ్‌ఠాకూర్‌ వెల్లడించారు. జూన్‌ 15 నాటికి దర్యాప్తును పూర్తి చేసి ఛార్జిషీట్‌ సమర్పిస్తామని రెజ్లర్లకు హామీ ఇచ్చినట్టు చెప్పారు. అలాగే రెజ్లింగ్‌ ఫెడరేషన్‌కు జూన్‌ 30 లోపు ఎన్నికలు నిర్వహిస్తామని అనురాగ్‌ఠాకూర్‌ చెప్పారు. ‘చాలా సీరియస్‌గా చర్చలు జరిగాయి. ఇక్కడికి వచ్చిన ప్లేయర్లు,కోచ్‌లు చాలా సానుకూల ధోరణితో మాట్లాడారు. జూన్‌ 15 లోగా దర్యాప్తు పూర్తి చేసి బ్రిజ్‌భూషణ్‌పై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని వాళ్లడిగారు. తప్పకుండా పూర్తి చేస్తాం ‘ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు. అనురాగ్‌ఠాకూర్‌తో బజరంగ్‌ పూనియాతో పాటు సాక్షి మాలిక్‌ కూడా చర్చలు జరిపారు. ఈనెల 15 వరకు తమ ఆందోళనలను వాయిదా వేస్తున్నామని , అప్పటిలోగా తమ డిమాండ్లు నెరవేర్చకపోతే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు రెజ్లర్లు. బ్రిజ్‌భూషణ్‌ను జైల్లో వేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌గా మహిళను నియమించాలని కూడా కేంద్రమంత్రితో చర్చల సందర్భంగా పహిల్వాన్లు డిమాండ్‌ చేశారు. కేంద్రంతో రెజ్లర్లు చర్చలు జరపడం ఇది రెండోసారి. మూడు రోజుల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో కూడా రెజ్లర్లు సమావేశమయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..