బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. రెండో ఇన్నింగ్స్లో పునరాగమనం చేసినప్పటికీ, తొలి ఇన్నింగ్స్లో కేవలం 46 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్కి ఓటిమి తప్పలేదు. ఓటమిపై తర్వాత తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. న్యూజిలాండ్తో ఇంకా మిగిలిన రెండు టెస్టుల్లోనూ పుంజుకోవాలనే పట్టుదలను ఆయన వ్యక్తం చేశాడు. తదుపరి గేమ్లలో టీమిండియా గెలిచే అవకాశాలు ఆశాజనకంగా ఉన్నట్లు ధీమా వ్యక్తం చేశారు.
సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలతో భారత్ రెండో ఇన్నింగ్స్లో మెరుగైన స్కోరు సాధించడంలో సహాయపడిందని రోహిత్ ప్రశంసించాడు. ఇలాంటి ఓటమిలు తప్పు ఎన్నో చూసామని, మళ్లీ భారత్ టీమ్ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము న్యూజిలాండ్ మొదటి టెస్ట్ మ్యాచ్లో తక్కువ స్కోరుకు ఆలౌటవుతామని అనుకోలేదని చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కొవడంలో విఫలమైనట్లు హిట్ మ్యాన్ అంగీకరించాడు.
న్యూజిలాండ్ 1988 తర్వాత భారత్లో తమ తొలి టెస్టు విజయాన్ని సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లను నిరంతరం ఇబ్బంది పెట్టే జస్ప్రీత్ బుమ్రా బలమైన ప్రయత్నం చేసినప్పటికీ, 107 పరుగుల లక్ష్యాన్ని చేరుకోకుండా భారత్ వారిని నిరోధించలేకపోయింది. సిరీస్లో ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉండగానే భారత్ను మళ్లీ విజయపథంలో నడిపించాలని రోహిత్ శర్మ పట్టుదలతో ఉన్నాడు. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో ఆడిన ఆటనే మిగితా రెండు టెస్ట్ మ్యాచ్లకు కంటిన్యూ చేయాలి. అదే విధంగా మొదటి మ్యాచ్లో చేసిన తప్పులను సరిదిద్దుకుంటే రోహిత్ సేన అలవోకంగా విజయం సాధిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.