Assembly Constituencies: కాశ్మీర్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడానికి రంగం సిద్దం అయిందా?

|

Jul 01, 2021 | 10:11 PM

Donthu Ramesh: ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి ఏడేళ్లు కావస్తోంది. అసెంబ్లీ సీట్ల సంఖ్య ఇంకా పెంచలేదు. డిలిమిటేషన్‌ ప్రక్రియ ప్రారంభించి వెంటనే సీట్ల సంఖ్యను పెంచాలనే డిమాండ్‌

Assembly Constituencies: కాశ్మీర్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడానికి రంగం సిద్దం అయిందా?
Political Analysis
Follow us on

(దొంతు రమేష్, ఇన్‌పుట్ ఎడిటర్, టీవీ9 తెలుగు)

Assembly Constituencies: ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి ఏడేళ్లు కావస్తోంది. అసెంబ్లీ సీట్ల సంఖ్య ఇంకా పెంచలేదు. డిలిమిటేషన్‌ ప్రక్రియ ప్రారంభించి వెంటనే సీట్ల సంఖ్యను పెంచాలనే డిమాండ్‌ రెండు రాష్ట్రాల నుండి ఊపందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంచకపోవడానికి ఉన్న సాంకేతిక, రాజ్యంగ పరమైన ఆటంకాలు ఏంటి? విభజన చట్టంలో పొందుపరచిన తరువాత కూడా ఎందుకు సీట్లు పెంచడంలేదు. సీట్ల పెంపు ఇప్పట్లో సాధ్యం అవుతుందా?

2013 లో కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుపై చర్చలు జరుపుతున్నప్పుడు అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచే విషయంలో కాంగ్రెస్‌ నేత మర్ర శశిధర్‌ రెడ్డి చొరవచూపారు. AP పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుండి 153 కు మరియు ఆంధ్రప్రదేశ్ లో 175 నుండి 225 కి పెంచడానికి చట్టం (సెక్షన్ 26) లో పొందు పరిచే విషయంలో శశిధర్‌ రెడ్డి కృతకృతులయ్యారు. ఇక్కడ చట్టంలో పొందుపరిచినప్పటికీ రాజ్యంగం లోని ఆర్టికల్ 170 కి లోబడి పెంపు ప్రక్రియ పుంటుందని పేర్కొన్నారు.

ఇదిలాఉండగా జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 లో కూడా అసెంబ్లీ సీట్ల సంఖ్యను 83 నుండి 90 కి పెంచడానికి వీలు కల్పించారు. ఆగష్టు 5, 2019 కి ముందు, ఆ రాష్ట్రంలోని లోక్ సభ స్థానాల డీలిమిటేషన్ భారత రాజ్యాంగం లోబడి జరిగినా, అసెంబ్లీ స్థానాల డీలిమిటేషన్ను మాత్రం జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం, జమ్మూ కాశ్మీర్ ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1957 లోబడి చేశారు. ఆనాడు జమ్మూ కాశ్మీర్‌లో అమలులో ఉన్న ప్రత్యేక రాజ్యంగం ప్రకారం డిలిమిటేషన్‌ అయింది. అయితే ఇప్పుడు ప్రత్యేక రాజ్యంగ హక్కులు లేని దృష్ట్యా జుమ్మూ కాశ్మీర్‌లో మొత్తం డిలిమిటేషన్ ప్రక్రియ మన రాజ్యాంగం ప్రకారమే జరుగాల్సింది.

ఆర్టికల్ 170 విషయానికొస్తే, 2002 లో సవరించినట్లుగా సీట్ల సంఖ్యను, వాటి పరిధి – ప్రాదేశిక 2026 తరువాత మొదటి జనాభా గణన తరువాత మార్చవచ్చని ఉంది..సుమారు 2 సంవత్సరాల తరువాత, ప్రధాని నరేంద్ర మోడీ కాశ్మీర్ పై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఇతర విషయాలతోపాటు, అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ గురించి చర్చించారు. సీట్ల సంఖ్యను పెంచే ప్రక్రియ ఆర్టికల్ 170 కు లోబడి ఉంటుందని, అందుకే రాజ్యాంగ సవరణ అనివార్యం అని చెప్పారు. స్వయంగా ప్రధాని చొరవ తీసుకోవడం తో ఇది త్వరలో ప్రారంభమవుతుందని అర్ధం అవుతుంది. ఇక్కడే తెలగు రాష్ట్రాల ఆశలు చిగురిస్తున్నాయి.

జమ్మూ కాశ్మీర్‌తో పాటు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచినట్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలోను కాశ్మీర్ తోబాటు ఏకకాలంలో డిలిమిటేషన్‌ అవుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ చెబుతున్నారు. ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి, ప్రధానికి వినోద్‌ లేఖలు రాశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల మునిగిపోయే పూర్వపు ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలను బదిలీ చేయాలని ఎన్డీయే ప్రభుత్వంలో భాగమైన టిడిపి పట్టుబట్టడంతో విభజన తరువాత ఈ చట్టం సవరించబడింది.

ఈ 7 మండలాలు 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో భాగంగా ఉన్నాయి, అవి భద్రాచలం, అశ్వరావుపేట,పినపాక వాటి పరిధి మరియు సరిహద్దులు మార్చబడ్డాయి. ఇది ఆర్టికల్ 170 లోని నిబంధనలకు విరుద్ధం. ఈ 7 మండలాల ఓటర్లు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఓటు వేశారు, కాని వారి బదిలీ తరువాత ఎపి నివాసితులు అయ్యారు.

రాష్ట్ర అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిఎం కెసిఆర్ 2018 ఆగస్టులో యోచించినప్పుడు తెలంగాణలోని 3 నియోజకవర్గాల ఓటర్లుగా తొలగించి, ఎపిలోని రెండు నియోజకవర్గాల ఓటర్లుగా మార్చడానికి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యే డీలిమిటేషన్ చేయలేదని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి. రాజ్యాంగ సవరణ అవసరమని శశిధర్‌ రెడ్డి వాదించారు. ఎందుకంటే కేవలం ఒక గ్రామాన్ని ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజకవర్గానికి బదిలీ చేయడం కూడా సరిహద్దులు మార్చబడి అది డీలిమిటేషన్ తప్ప మరొకటి కాదు. అలాంటప్పుడు ఇప్పటి వరకు డిలిమిటేషన్‌ చేయకపోడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

7 మండలాలకు సంభందించి డెలిమిటేషన్ పై నేను 08.09.2018 న పిల్ కూడా దాఖలు చేశాడు శశిధర్‌ రెడ్డి. ఈనేపథ్యంలో 22.09.2018 న ఈసీ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది, ఇది రాజ్యాంగ విరుద్ధం అని, ఏడు మండలాల విషయం తేలకుండా ముందస్తు ఎన్నికలు నిర్వహించడంపై విమర్శలు రేగాయి. ఈసీ రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించిందని ఆరోపణలు వచ్చాయి. ఈసీ తప్పను ఎత్తిచూపుతూ శశిధర్‌ రెడ్డి 18.03.2021 న సిఇసికి లేఖ రాశాను. పార్లమెంటరీ , అసెంబ్లీ నియోజకవర్గాల ఉత్తర్వు, 2008 ను సముచితంగా సవరించడానికి 22.09.2018 నాటి చట్టవిరుద్ధ నోటిఫికేషన్ స్థానంలో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కొరకు విడిగా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యే నోటిఫికేషన్లను జారీ చేయాలని శశిధర్‌ రెడ్డి లేఖలో పేర్కొన్నాడు. కాశ్మీర్‌పై జరిగిన అన్ని పార్టీల సమావేశానికి కేవలం 3 రోజుల ముందు, 21.06.2021 ఈసీ నుంచి ఒక వివరణ వచచింది.

మొత్తం మీద జమ్మూ కాశ్మీర్‌లో డిలిమిటేషన్‌ ప్రక్రియ ప్రారంభమై సీట్ల సంఖ్య పెరిగితే రాజ్యంగం చట్టం ప్రకారం ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచడం అనివార్యం.

Also Read: CM YS Jagan Letter to PM Modi: తెలుగు రాష్ట్రాల జలజగడంలో మరో ట్విస్ట్.. జోక్యం చేసుకోవాలంటూ ఏపీ సీఎం ప్రధానికి లేఖ

TPCC: కాంగ్రెస్‌లో కోల్డ్ వార్ షురూ.. రేవంత్‌పై గుర్రుగా ఉన్న సీనియర్ నేతలు.. కలిసేందుకు నో ఛాన్స్!