Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర హిందువుల ముఖ్యమైన యాత్ర. ఈ యాత్రను తమ జీవిత కాలంలో ఒక్కసారైనా చేయాలని ప్రతి ఒక్క హిందువు కల కంటారు. అయితే చార్ ధామ్ యాత్రకు బయలుదేరుతున్న , యాత్రలో పాల్గొన్న భక్తులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక సూచన చేసింది. మే 3 వ తేదీన మొదలైన చార్ ధామ్ యాత్రలో పాల్గొన్న భక్తులు మార్గ మధ్యలో అనారోగ్యానికి గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఉత్తరాఖండ్( Uttarakhand) ఆరోగ్య డైరెక్టర్ జనరల్ డా.శైలజా భట్ ఆందోళన వ్యక్తం చేశారు. చార్ ధామ్ యాత్ర మార్గంలో ఇప్పటి వరకూ మొత్తం 39 మంది యాత్రికులు మరణించారని (Char Dham Pilgrims Death) తెలిపారు. మరణానికి కారణం అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, పర్వతం ఎక్కడం వలన అలసట చెందడం తదితర కారణలో యాత్రీకులు మరణిస్తున్నారని తెలిపారు. అందుకని వైద్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న యాత్రికులు చార్ ధామ్ యాత్రలో ప్రయాణించవద్దని డాక్టర్ శైలజా భట్ సూచించారు.
బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రిలను కలిపి చార్ధామ్ యాత్రగా వ్యవహరిస్తారు. సంవత్సరంలో ఆరు నెలలు మంచుతో మూసుకుపోయే ఈ ఆలయాల చార్ధామ్ యాత్ర ఇటీవల ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో చార్ధామ్ యాత్రలో పాల్గొంటున్న భక్తులకు మార్గ మధ్యలో వైద్య పరీక్షలు నిర్వహించేలా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆదేశాలు జారీ చేశారు. వైద్య పరీక్షల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేలితే, ఆ భక్తులకు ఎంత విశ్రాంతి కావాలో సూచిస్తారు. వైద్య సలహాలతోనే చార్ ధామ్ యాత్ర కొనసాగించవలసి ఉంటుందని శైలజా భట్ చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..