PM Modi: ఎవరినీ వదిలిపెట్టం.. కఠినంగా వ్యవహరిస్తాం: ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..

|

Aug 25, 2024 | 3:45 PM

కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య, బద్లాపూర్‌లో చిన్నారిపై అత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందించిన ప్రధాని మోదీ..

PM Modi: ఎవరినీ వదిలిపెట్టం.. కఠినంగా వ్యవహరిస్తాం: ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..
PM Narendra Modi
Follow us on

కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య, బద్లాపూర్‌లో చిన్నారిపై అత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందించిన ప్రధాని మోదీ.. అటువంటి నేరాలకు పాల్పడే వారిని ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మహారాష్ట్రలోని జల్గావ్‌లో జరిగిన ‘లఖపతి దీదీ’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మాట్లాడిన మోదీ.. నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా శిక్షపడేలా చేస్తామని, కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టంచేశారు. ఇందుకోసం కఠిన చట్టాలను రూపొందించామని వెల్లడించారు. మహిళలపై అఘాయిత్యాలపై పాల్పడే వారిని వదిలిపెట్టవద్దని.. జవాబుదారీగా పనిచేయండి అంటూ ప్రధాని మోదీ అధికారులకు సూచించారు.

మహిళలపై హింస క్షమించరాని పాపం.. దోషి ఎవరైనా వదలిపెట్టకూడదు.. అతనికి ఏ విధంగా సహాయం చేసినా తప్పించుకోకూడదు.. ఇదే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వం వస్తుంది, పోతుంది.. కానీ ప్రజల ప్రాణాలకి రక్షణ కల్పించాలి.. స్త్రీ గౌరవాన్ని కాపాడాలంటూ సూచించారు. మహిళలను అణచివేసే వారిని కఠినంగా శిక్షించేందుకు తమ ప్రభుత్వం చట్టాన్ని కఠినతరం చేస్తోందని నరేంద్ర మోదీ అన్నారు.

మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్న ప్రధాని మోదీ.. ముందుగా ఫిర్యాదులు వస్తున్నాయని, సకాలంలో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడం లేదంటూ పేర్కొన్నారు. విచారణ ఆలస్యంగా ప్రారంభమవుతుందని.. దీంతో కేసు పక్కదోవ పడుతుందని తెలిపారు. ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ నుండి ఈ ఇబ్బందులు తొలగించారని.. బాధిత మహిళలు పోలీసు స్టేషన్‌కు వెళ్లకూడదనుకుంటే, వారు ఈ-ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయవచ్చంటూ పేర్కొన్నారు. ఈ-ఎఫ్‌ఐఆర్‌ను ఎవరూ తారుమారు చేయలేరని తెలిపారు. ఇది దర్యాప్తును వేగవంతం చేస్తుందని.. దోషులను శిక్షించడంలో దోహదపడుతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

కొత్త చట్టం ప్రకారం మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడితే మరణశిక్ష.. జీవిత ఖైదు. పెళ్లి పేరుతో అమ్మాయిలను మోసం చేస్తే.. దానికి ఎలాంటి శిక్ష పడలేదని.. ఇప్పుడు దీనిపై కూడా చట్టాలు చేశామన్నారు. మహిళలపై అఘాయిత్యాలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోందని.. అణచివేత మనస్తత్వాన్ని దూరం చేసుకోవాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..