దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సభ్యత్వ నమోదు కార్యక్రమం పండుగలా కొనసాగుతోంది.. ఈ డ్రైవ్ లో స్వయంగా పార్టీకి చెందిన అగ్రనేతలంతా పాల్గొంటున్నారు. ఇంటింటికి తిరుగుతూ పార్టీ సభ్యత్వాలను నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒడిశాలో ఆసక్తికర పరిణామం చూటుచేసుకుంది. ఒడిశాలోని సుందర్ఘర్ జిల్లాలో బీజేపీ ఎంపీ బైజయంత్ జే పాండా అలాగే పలువురు నేతల ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సమయంలో ఓ ఆదివాసీ మహిళ బీజేపీ సభ్యత్వం తీసుకుని మరి.. రూ.100 ప్రధాని మోదీకి ఇవ్వాలంటూ అక్కడున్న నేతలను కోరింది.. దీంతో వారంతా వద్దంటూ ఆమెను వారించారు.. కానీ అదేమి వినకుండా.. మోదీకి ధన్యవాదాలు తెలిపేందుకు రూ.100 తీసుకోని.. ఆయనకు ఇవ్వాల్సిందేనంటూ అక్కడున్న వారికి స్పష్టంచేసింది.. ఈ విషయాన్ని బీజేపీ బైజయంత్ జే పాండా తన ట్విట్టర్ లో షేర్ చేశారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఓ మహిళ మోదీకి ఇవ్వాలని రూ.100 ఇచ్చిందని.. ఇది భారత పరివర్తనకు ప్రతిబింబం అంటూ షేర్ చేశారు.
‘‘ఒడిశాలోని సుందర్ఘర్ జిల్లాలో సభ్యత్వం కోసం ఈ ఆదివాసీ మహిళ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలియజేయడానికి నాకు రూ.100 ఇచ్చి మోదీకి ఇవ్వాలని పట్టుబట్టింది. ఆమె నేను ఏం చెప్పినా వినలేదు.. అవసరం లేదంటూ వివరణలను పక్కన పెట్టింది.. నేను చివరకు డబ్బులను తీసుకునే వరకు వాటిని తీసుకోనంటూ సమాధానం చెప్పింది. ఇది ఒడిశా.. భారత్ పరివర్తనకు ప్రతిబింబం.. జై జగన్నాథ్’’ అంటూ బీజేపీ ఎంపీ ఎక్స్ లో షేర్ చేశారు.
Very touched by this affection. I bow to our Nari Shakti for always blessing me. Their blessings inspire me to keep working to build a Viksit Bharat. https://t.co/Iw8m51zagY
— Narendra Modi (@narendramodi) October 19, 2024
ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు.. ఇది తన మనస్సును తాకిందని.. వికసిత్ భారత్ నిర్మాణానికి ఇదే స్ఫూర్తినిస్తుందని ప్రధాని మోదీ ఎక్స్ లో షేర్ చేశారు. ‘‘ఈ ఆప్యాయత చాలా హత్తుకుంది. నన్ను ఎల్లప్పుడూ ఆశీర్వదించే మా నారీ శక్తికి నమస్కరిస్తున్నాను. వారి ఆశీస్సులు వికసిత్ భారత్ను నిర్మించేందుకు నిరంతరం కృషి చేసేందుకు నాకు స్ఫూర్తినిస్తున్నాయి.’’ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..