తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, సినీ నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్కు కీలక పదవి దక్కింది. డీఎంకే పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పదవి మళ్లీ ఆయనకే వరించింది. అంతే కాకుండా ఈ విభాగంలో 8 మంది కొత్త వారికి చోటు ఇచ్చారు. డీఎంకే ఎంపీ కనిమొళి చేతిలో ఉన్న మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పగ్గాలను కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్కు చెందిన హెలెన్ డేవిడ్సన్కు అప్పగించారు. కాగా.. సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. ఆయన రాజకీయాల్లోకి రాగానే డీఎంకేకు కీలకంగా భావిస్తున్న ఆ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు. అప్పట్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రజలందరినీ ఆకర్షించారు. అంతే కాకుండా చేపాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసి, విజయం సాధించి అసెంబ్లీ మెట్లు ఎక్కారు. దీంతో విజయపథంలో దూసుకెళ్తున్న ఉదయనిధికి మళ్లీ అదే బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ వివరాలు వెల్లడించారు. అయితే.. డీఎంకే యువజన విభాగంలో ప్రధాన సెక్రటరీ, నలుగురు జాయింట్ సెక్రటరీలు ఉంటారు. ఈ క్రమంలో సంయుక్త కార్యదర్శుల సంఖ్యను ఈసారి తొమ్మిదికి పెంచారు.
పాత వారిలో కేవలం జోయల్కు మాత్రమే మళ్లీ అవకాశం ఇచ్చారు. మిగిలిన వారిని పక్కన పెట్టారు. సంయుక్త ప్రధాన కార్యదర్శులుగా శ్రీనివాసన్, రాజ, ఏఎన్ రఘు, జోయల్, రఘుపతి, ప్రకాష్, ప్రభు, ఇలయరాజ, అబ్దుల్ మాలిక్ను నియమించారు. ఈ క్రమంలో తన మీద నమ్మకంతో మళ్లీ బాధ్యతలు అప్పగించినందుకు పార్టీకి ఉదయ నిధి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు.. డీఎంకే మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ ఎంపీ కనిమొళి వ్యవహరిస్తున్నారు.
ఇటీవల ఆమెకు పదోన్నతి దక్కడంతో డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను ఆమెకు అప్పగించారు. దీంతో మహిళా విభాగం బాధ్యతలను మరొకరికి అప్పగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విభాగం అధ్యక్షురాలిగా విజయ దయాల్ అన్భును నియమించారు. ప్రధాన కార్యదర్శి పదవిని కన్యాకుమారి జిల్లాకు చెందిన హెలెన్ డేవిడ్ సన్ కు అప్పగించారు. జాయింట్ సెక్రటరీగా కుమారి విజయ కుమార్, ఉపాధ్యక్షులుగా భవానీ, మంత్రి కయల్వెలి సెల్వరాజ్ బాధ్యతలు చేపట్టనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం