సుప్రీం కోర్టు విచారణకు ముందే పార్టీపై పట్టు సాధించాలనే షిండే ఎత్తుగడలా కనిపిస్తోంది. ఎందుకంటే 19 మంది సేన ఎంపీలలో 12 మంది కూడా జాతీయ కార్యవర్గాన్ని రద్దు చేసి దానిని పునర్నిర్మించాలనే షిండే చర్యకు మద్దతు లభించింది. అయితే మహారాష్ట్ర (Maharashtra)అసెంబ్లీలో శివసేన శాసనసభాపక్షం రెండుగా చీలిపోయినట్లే ఇప్పుడు పార్లమెంటరీ పార్టీలోనూ రిపీట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. లోక్సభలో ఆ పార్టీకి 19 మంది ఎంపీలు(దాద్రా, నగర్ హవేలి ఎంపీ సహా) ఉన్నారు. కాగా, వీరిలో కనీసం 12 మంది మంగళవారం స్పీకర్ ఓం బిర్లాను కలిసి తమను ప్రత్యేక గ్రూప్గా గుర్తించాలని కోరుతూ లేఖను అందించనున్నారు. దీనికి సంబంధించి సోమవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే(Eknath Shinde) నిర్వహించిన ఆన్లైన్ సమావేశానికి హాజరై ఎంపీ రాహుల్ షెవాలెను లోక్సభలో తమ నేతగా ఎన్నుకున్నామని శివసేన చీలిక వర్గం ఎంపీ ఒకరు ఇప్పటికే ప్రకటించారు. ఈ భేటీలో 14 మంది ఎంపీలు పాల్గొన్నట్లు వెల్లడించారు. మంగళవారం ఢిల్లీకి వస్తున్న శిందేను తామంతా కలుసుకుంటున్నట్లుగా ప్రకటించారు.
ఢిల్లీకి చేరుకున్న సీఎం ఏక్నాథ్ షిండే..
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సోమవారం అర్థరాత్రి ఢిల్లీకి(Delhi) చేరుకున్నారు. మహారాష్ట్రలో ఓబీసీ రిజర్వేషన్లపై కేంద్రంతో చర్చించేందుకు సీఎం ఏక్నాథ్ షిండే సోమవారం అర్థరాత్రి ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్కు చేరుకున్నారు. ఇతర వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లపై చర్చించేందుకే తాను ఢిల్లీకి వచ్చానని ఏక్నాథ్ షిండే వెల్లడించారు. ఓబీసీలకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చెప్పారు.
Delhi | Shiv Sena MPs will meet us. We have 18 MPs, not just 12: Maharashtra CM Eknath Shinde on virtual meeting with Shiv Sena MPs pic.twitter.com/KzmTziVIAr
— ANI (@ANI) July 18, 2022
మరో చీలిక వర్గం..
పావులు వేగంగా కదులుతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీలు కొందరు సంజయ్ రౌత్ నివాసంలో సమావేశం అవుతుండగా.. వీరిలో అరవింద్ సావంత్, వినాయక్ రౌత్, ఒమ్రాజె నింబాల్కర్, సంజయ్ జాధవ్, ప్రియాంకా చతుర్వేది, రాజన్ వికారే ఉన్నారు. అయితే.. లోక్సభ ఎంపీ గజానన్ కీర్తికర్ అనారోగ్యం వల్ల భేటీకి రాలేకపోతున్నారు. చీలిక వర్గంలో 14 మంది ఎంపీలున్నారన్న ప్రచారంలో నిజం లేదని సంజయ్ రౌత్ కొట్టిపారేశారు.
ఇదిలావుంటే.. మరోవైపున వినాయక్ రౌత్ నేతృత్వంలో ఠాక్రే వర్గ ఎంపీలు సోమవారం సాయంత్రం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. శివసేన పార్లమెంటరీ పార్టీ నేతగా వినాయక్ రౌత్, చీఫ్ విప్గా రాజన్ వికారే నియమితులయ్యారని కోరారు. ఈ విషయంలో చీలిక వర్గం చేసే విజ్ఞప్తులను.. జారీ చేసే విప్లను పట్టించుకోవద్దని అభ్యర్థించారు.