Jharkhand Elections: ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి..! సోరెన్ కీలక ప్రకటన

|

Oct 19, 2024 | 7:08 PM

జార్ఖండ్ అసెంబ్లీకి రెండు దఫాల్లో నవంబరు 13, 20 పోలింగ్ నిర్వహించనుండగా.. నవంబరు 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇది వరకే షెడ్యూల్ ప్రకటించింది. ఆ రాష్ట్రంలో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. సీట్ల సర్దుబాటు జరిగినట్లు ఎన్డీయే ప్రకటించిన మరుసటి రోజే.. ఆ రాష్ట్ర సీఎం, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటుపై కీలక ప్రకటన చేశారు.

Jharkhand Elections: ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి..! సోరెన్ కీలక ప్రకటన
Rahul Gandhi, Hemant Soren
Follow us on

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. జార్ఖండ్‌ అసెంబ్లీలోని మొత్తం 81 స్థానాల్లో 70 స్థానాల్లో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనున్నాయి. ఆ మేరకు జేఎంఎం చీఫ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శనివారం కీలక ప్రకటన చేశారు. అయితే వీటిలో జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలు ఎన్నేసి స్థానాల్లో పోటీ చేస్తాయో వెల్లడించలేదు. కూటమి పక్షాల నేతల సమక్షంలో దీనికి సంబంధించి త్వరలోనే ప్రకటన చేస్తామని హేమంత్ సోరెన్ మీడియాకు తెలిపారు.

జార్ఖండ్‌లో బీజేపీతో తలపడనున్న ఇండియా కూటమిలో రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్జేడీ), వామపక్షాలు కూడా భాగస్వామ్యంగా ఉంటాయి. ఈ పార్టీలకు మిగిలిన 11 సీట్లు కేటాయించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీలతో పొత్తుకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నట్లు హేమంత్ సోరెన్ తెలిపారు.

జార్ఖండ్ అసెంబ్లీకి రెండు దఫాల్లో నవంబరు 13, 20 పోలింగ్ నిర్వహించనుండగా.. నవంబరు 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం 43 స్థానాలు, కాంగ్రెస్ 31 స్థానాల్లో పోటీ చేసింది. ఇతర పార్టీలను కూడా కూటమిలో చేర్చుకుని సీర్దుబాటు చేయాల్సి ఉండటంతో ఈ సారి కాంగ్రెస్ పార్టీకి 27 నుంచి 28 స్థానాలు కేటాయించే అవకాశమున్నట్లు సమాచారం. గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాల్లో జేఎంఎం పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది. జేఎంఎం – కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎంఎల్), మార్స్కిస్ట్ కోర్డినేషన్ కమిటీ(ఎంఎంసీ) కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఏడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. బలమైన కూటమి కోసం ఒకట్రెండు సీట్లను ఆర్జేడీ వదులుకునే అవకాశముంది.

కాగా ఎన్డీయే కూటమిలో సీట్ల సర్దుబాటు ఇప్పటికే కొలిక్కి వచ్చింది. బీజేపీ 68 స్థానాలు, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ (ఏజేఎస్‌యూ) 10 స్థానాలు, జనతా దళ్ (యునైటెడ్) 2 స్థానాలు, లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) 1 స్థానంలో పోటీ చేయనున్నాయి.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం 30 స్థానాలు, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1 స్థానంలో గెలిచాయి. ఆ మూడు పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీజేపీ 25 స్థానాలకు పరిమితమయ్యింది. 2014లో ఇక్కడ బీజేపీ బలం 37గా ఉంది.