India monkeypox cases: దేశంలో కరోనావైరస్కి తోడు మంకీపాక్స్ విస్తరిస్తోంది. కేరళ, ఢిల్లీలో వణుకు పుట్టిస్తోంది. ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. ఒక్కరోజే రెండు కేసులు నమోదయ్యాయి. కేరళలో యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తికి, ఢిల్లీలో మరో నైజీరియన్కు మంకీపాక్స్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఢిల్లీలో.. ఎలాంటి విదేశీ పర్యటన చరిత్ర లేని ఆఫ్రికన్ సంతతికి చెందిన 35 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో నైజీరియన్ సోమవారం ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. కేరళలో ఐదు, దేశ రాజధాని ఢిల్లీ మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో మంకీపాక్స్ సోకిన వారి సంఖ్య 8కి చేరగా.. కేరళలో తొలి మంకీపాక్స్ మరణం నమోదైంది. మరోవైపు మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఈ వైరస్పై భయాందోళనలు అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు ప్రబలిన సమయంలోనే దీన్ని ఎదుర్కొనేందుకు భారత్ సన్నాహాలు చేపట్టిందని వివరించారు. మంకీపాక్స్ భారత్ సహా ప్రపంచానికి కొత్త వ్యాధి ఏమీ కాదని, 1970ల్లోనే ఆఫ్రికా నుంచి పలు కేసులు వెలుగుచూశాయని చెప్పారు. మంకీపాక్స్పై ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రత్యేకంగా దృష్టి సారించిందని, భారత్లోనూ మంకీపాక్స్ను భారత్ కూడా నిశితంగా గమనిస్తూ దీటైన చర్యలు చేపడుతున్నని మంత్రి మన్సుక్ మాండవీయ రాజ్యసభలో పేర్కొన్నారు. భారత్లో ఇప్పటివరకూ 8 మంకీపాక్స్ కేసులు వెలుగుచూశాయని.. వీరిలో ఐదుగురికి విదేశీ ట్రావెల్ చరిత్ర ఉందని అన్నారు.
మంకీపాక్స్పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపడతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నీతి ఆయోగ్ సభ్యుడి అధ్యక్షతన టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. రోగనిర్ధారణ కిట్లు, వ్యాక్సిన్ల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు జాతీయ టాస్క్ఫోర్స్ కృషిచేస్తుందని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి