నెల్లూరులో భారీ చోరీ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులమంటూ
నెల్లూరు సిటీ పొగతోటలోని మూన్ ల్యాండ్ అపార్టుమెంట్ లో భారీ చోరీ జరిగింది. రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులమంటూ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు భారీగా సొత్తును దోచుకెళ్లారు.
నెల్లూరు సిటీ పొగతోటలోని మూన్ ల్యాండ్ అపార్టుమెంట్ లో భారీ చోరీ జరిగింది. రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులమంటూ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు భారీగా సొత్తును దోచుకెళ్లారు. అపార్ట్మెంట్లోని సెకండ్ ఫ్లోర్ లో చెంచు రత్నం, కృష్ణవేణి దంపతులు నివాసముంటున్నారు. సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో అపార్ట్మెంట్ కు వచ్చిన ముగ్గురు వ్యక్తులు తాము ఎన్ఫోర్స్మెంట్ అధికారులమంటూ వాచ్మెన్కు చెప్పి చెంచు రత్నం ఇంట్లోకి ప్రవేశించారు.
పొలాలకు సంబంధించిన పత్రాలు తనిఖీ చేయాలంటూ చెంచు రత్నం, కృష్ణవేణిలను వేర్వేరు గదుల్లో ఉంచి ఇంట్లో సోదాలు చేశారు. రాత్రి ఒంటిగంట వరకు సోదాలు చేసిన వారు ఇంట్లోని 35 సవర్ల బంగారు ఆభరణాలు, 10.30 లక్షల రూపాయల నగదు, 10 కేజీలకు పైగా వెండి వస్తువులు తీసుకొని ఎస్కేప్ అయ్యారు. తెలిసిన వారి ద్వారా విచారించిన చెంచు రత్నం, అసలు వచ్చిన వారు అధికారులే కాదని నిర్ధారించుకున్నారు. వెంటనే చిన్న బజార్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. రియల్ ఎస్టేట్ మీడియేటరైన ఓ వ్యక్తి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి వచ్చినట్లు చెంచు రత్నం పోలీసులకు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read : కరోనాతో మృతిచెందిన కార్మికులకు రూ.5లక్షల పరిహారం: ఆర్టీసీ ఎండీ