హెచ్చరిక: మరో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షాలు.!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరికను జారీ చేసింది. రాగాల 4, 5 గంటల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు.
AP Rain Alert: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరికను జారీ చేసింది. రాగాల 4, 5 గంటల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశముందన్నారు. అలాగే శ్రీకాకుళం, ప్రకాశం, విజయనగరం, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
కాగా, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. మరోవైపు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కి.మీ. ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దాని ప్రభావం కారణంగా మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో అది తీవ్ర అల్పపీడనంగా మారుతుందని.. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
అటు రాష్ట్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా రాగాల 48 గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడమే కాకుండా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ అలెర్ట్ జారీ చేసింది.