Jagan on Polavaram: పోలవరం పూర్తికి జగన్ తాజా నిర్ణయం
వచ్చే ఏడాది పోలవరం ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలన్న లక్ష్యంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. అధికారులకు కీలక సూచనలు చేశారు.
CM Jagan has taken a fresh decision to complete Polavaram works: వచ్చే ఏడాది పోలవరం ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలన్న లక్ష్యంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. సకాలంలో ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు సీఎం అధికార యంత్రాంగానికి కొన్ని సూచనలు చేశారు.
పోలవరం ప్రాజెక్టుపై శుక్రవారం నాడు జగన్ సమీక్ష జరిపారు. 2021 సీజన్ కల్లా పోలవరం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకు వస్తేనే ప్రయోజనకరంగా ఉంటుందని సీఎం ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. గతంలో ప్రణాళిక లోపం, సమన్వయ లోపం, సమాచార లోపం ఉండేదని, అందువల్లే ప్రస్తుత సీజన్ను నష్టపోవాల్సి వచ్చిందని సీఎం అన్నారు.
వచ్చే సంవత్సరం కల్లా పోలవరం ప్రాజెక్టును వినియోగంలోకి తెచ్చేందుకు జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కూడా పనులు జరగాలని సీఎం ఆదేశించారు. వర్షాకాలంలో సైతం పనులు జరిగేలా చూడాలని, అందుకు ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని జగన్ నిర్దేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్పిల్వే పనులు జూన్ కల్లా పూర్తికావాలని, అదేవేగంతో అప్రోచ్ ఛానల్కూడా పూర్తికావాలని డెడ్లైన్ విధించారు.
కాపర్ డ్యాం పూర్తిచేసేసరికి ముంపు పెరుగుతుందని, ముంపు ప్రాంతాలనుంచి ప్రజలను తరలించాల్సి ఉంటుందని సీఎం సూచించారు. సహాయ పునరావాస పనులపై ఇప్పటినుంచే దృష్టిపెట్టి పనులను ప్రారంభించాలని, సత్వరంగా అనుమతులు తెప్పించుకోవడం కోసం ఢిల్లీలో ఒక అధికారిని ఉంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. డ్రాయింగులు, డిజైన్ల అనుమతికోసం, లైజనింగ్కోసం ఒక పూర్తిస్థాయి అధికారిని నియమించాలని ఆదేశించారు.
కుడి, ఎడమ కాల్వలను అనుకున్న లక్ష్యంలోగా వినియోగంలోకి తీసుకు రావడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం, జూన్కల్లా కుడి కాలువ ద్వారా తప్పకుండా నీరు పోయేలా ఏర్పాటు చేయాలన్నారు. జూన్కల్లా రైట్మెయిన్కెనాల్ కనెక్టివిటీ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. స్పిల్వే ముందరి భాగంలో నిర్మించాల్సిన బ్రిడ్జిపైనా సీఎం పర్యటనలో చర్చ జరిగింది. ఈ బ్రిడ్జిని ఎర్త్ కం రాక్ఫిల్ డ్యాంతో అనుసంధానించేలా డిజైన్ చేశారు. తద్వారా నాలుగు వరుసల రహదారి ఏర్పడుతుందని సీఎంకు అధికారులు వివరించారు. డిజైన్ ఖరారు చేసి ఆమేరకు పనుల విషయంలో ముందుకు వెళ్లాలన్న సీఎం ఆ బ్రిడ్జికి వైఎస్సార్ గేట్ వేగా నామకరణం చేయాలని సూచించారు.
పోలవరం ముంపు ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలపైనా సీఎం సమీక్ష జరిపారు. కాపర్డ్యాంలో ఇప్పుడున్న ఖాళీలను పూర్తి చేస్తే గోదావరిలో 41.15 మీటర్ల మేర నీరు నిల్వ ఉంటుందని తెలిపిన అధికారులు.. అందుకోసం వెంటనే 17వేలకు పైగా కుటుంబాలను తరలించాల్సి ఉంటుందని సీఎంకు వివరించారు. ప్రాధాన్యతా క్రమంలో తరలించాల్సిన వారి వివరాలు సిద్ధంచేసుకోవాలని, ఆర్ అండ్ ఆర్ పనుల కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు సీఎం జగన్.
యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడానికి అవసరమైన డబ్బును అందుబాటులో ఉంచుతామని ముఖ్యమంత్రి అధికారులకు తెలిపారు. 35 కాంటూరులో కూడా 6 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, ఆ 6 గ్రామాలను తరలించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు.