అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం 1990ల నుండి ముంబై నగరంతోపాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆధిపత్యం కోసం ప్రయత్నించాడు. అప్పట్లో గ్యాంగ్ వార్ జరిగింది. ఇక ఇప్పుడు చాలా కాలం తర్వాత మరోసారి ముంబైలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఎన్సీపీ నేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి బాబా సిద్ధిఖీ హత్య తర్వాత ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సిద్ధిఖీ హత్యతో అటు బాలీవుడ్ కూడా ఉలిక్కిపడింది. నార్త్ ఇండియాలో ప్రభంజనం సృష్టించిన లారెన్స్ బిష్ణోయ్ ఇప్పుడు బాలీవుడ్ లో భీభత్సం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు. దావూద్ ఇబ్రహీం ఏలిన బాలీవుడ్లో అడుగుపెట్టాలని గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ భావిస్తున్నారా? సొంతంగా – D-కంపెనీ ఏర్పాటు చేసే ఆలోచనలో లారెన్స్ ఉన్నారా? ఈ ప్రశ్నలకు పోలీసుల నుంచి అవుననే సమాధానం వస్తోంది.
బాలీవుడ్లో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ మాటలకు చాలా విలువ ఉంటుంది. ఈ ముగ్గురూ బాబా సిద్ధిఖీకి దగ్గరి సన్నిహితులు. ఇప్పుడు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బాబా సిద్ధిఖీని హత్య చేసి ఈ ముగ్గురు హీరోలకు ముఖ్యంగా సల్మాన్ ఖాన్కు సందేశం పంపాడు. సల్మాన్ పాపులారిటీని ఉపయోగించుకుని బాలీవుడ్లో భీభత్సం సృష్టించాలనేది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ అని తెలుస్తోంది. ముంబయిలో NCP నేత బాబా సిద్ధిఖీని హత్య చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పుడు ఏడొందల మంది సభ్యులతో బలంగా ఉందని పోలీసులు గుర్తించారు. వీళ్లంతా షార్ప్ షూటర్లే. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ గ్యాంగ్ ఈ ఏడాది ఏప్రిల్లో ఆయన ఇంటిపై కాల్పులు జరిపింది. లారెన్స్ హిట్ లిస్ట్లో ఇప్పుడు యాక్టర్లు, కమెడియన్లు, రాజకీయ నాయకులతో పాటు ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యులు కూడా ఉన్నారు.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ బిష్ణోయ్ ప్రధాన టార్గెట్గా ఉన్నారు. బిష్ణోయ్ సామాజికవర్గం ఆరాధించే కృష్ణజింకను కాల్చి చంపిన కేసులో సల్మాన్ పేరు ఉండటంతో సమస్య మొదలైనట్టు కనిపిస్తోంది. సల్మాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ – సల్మాన్పై నిఘా పెట్టేందుకు తన అనుచరుడు సంపత్ నెహ్రాను నియమించాడు. కానీ, అతడిని హర్యానా టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్లో ముంబయిలోని సల్మాన్ ఇంటిపై కాల్పులు జరపడం, పోలీసులు అదే సమయంలో రావడంతో ఆ పన్నాగం కూడా బెడిసికొట్టింది. దసరా రోజు హత్యకు గురైన NCP నేత బాబా సిద్ధిఖీ కుమారుడు జిషాన్ సిద్ధిఖీ కూడా ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హిట్లిస్ట్లో ఉన్నారు. బాబా సిద్ధిఖీని హత్య చేసినప్పుడే జిషాన్ను కూడా మట్టుబెట్టేందుకు లారెన్స్ గ్యాంగ్ ప్రయత్నించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సల్మాన్, దావూద్ గ్యాంగ్కు సాయపడే వాళ్ల లెక్క తేల్చుతామనే ఒక సోషల్ మీడియా పోస్టును పోలీసులు కనిపెట్టారు.
లారెన్స్ బిష్ణోయ్ నేర జీవితం 15 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. 1993లో పంజాబ్లో పుట్టిన లారెన్స్ తండ్రి హర్యానాలో పోలీసు కానిస్టేబుల్. చిన్నగా మొదలైన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పుడు ఒక అంతర్జాతీయ సిండికేట్గా ఎదిగింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లో వేళ్లూనుకున్న లారెన్స్ గ్యాంగ్ కెనడా, ఉత్తర అమెరికాలోనూ గట్టి పట్టు సంపాదించింది. లారెన్స్ బిష్ణోయ్ జైల్లో ఉన్నా కూడా కార్యకలాపాలు యధేచ్ఛగా సాగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ల పట్టేంటో. బిష్ణోయ్ గ్యాంగ్ D-కంపెనీ తరహాలోనే ఒక కార్పొరేట్ కంపెనీగా పనిచేస్తుంది. గుజరాత్లోని సబర్మతి జైల్లో ఉన్నప్పటికీ తన గ్యాంగ్పై లారెన్స్ బిష్ణోయ్కు పూర్తి పట్టుంది. ప్రపంచంలోని ఏడు దేశాలలో ఒక నెట్వర్క్ సృష్టించాడు. ముందుగా సల్మాన్ ఖాన్ను బెదిరించడం ప్రారంభించాడు. ఇప్పుడు బాలీవుడ్ను శాసించేలా ఫూల్ప్రూఫ్ ప్లాన్తో పని చేయడం స్టార్ట్ చేశాడు బిష్ణోయ్.
ఇది చదవండి: ‘అమ్మాయిలు అబ్బాయిలు’ మూవీ హీరోయిన్ గుర్తుందా ?.. ఆమె భర్త ఫేమస్ హీరో.. ఫోటోస్ వైరల్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.