విద్యుత్ బిల్లు.. వాయిదాల్లో కట్టొచ్చు.. కానీ..!
తెలంగాణలో విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో వాయిదాల్లో బిల్లులు చెల్లించే అవకాశం ఇస్తున్నట్లు ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. అయితే.
Electricity bills in Telangana : తెలంగాణలో విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో వాయిదాల్లో బిల్లులు చెల్లించే అవకాశం ఇస్తున్నట్లు ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. అయితే.. 1.5% ఆలస్య రుసుమును విధిగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో 95.13 లక్షల మంది వినియోగదారులు ఉండగా.. అందులో గృహ వినియోగదారులు 70.97 లక్షల మంది ఉన్నారని, ఇందులో 86% మంది 200 యూనిట్లలోపు వాడేవారు ఉన్నారని వివరించారు.
కాగా.. లాక్డౌన్ వల్ల దాదాపు 40 శాతం మంది వినియోగదారులు బిల్లు చెల్లించలేదన్నారు. ప్రతి నెలా 2 నుంచి 14వ తేదీలోపు బిల్లులు ఇస్తున్నామని, ఏప్రిల్లో కచ్చితమైన లాక్డౌన్ ఉండటంతో జారీ చేయలేకపోయామని తెలిపారు. మినహాయింపులతోనే జూన్ నెలలో.. మార్చి, ఏప్రిల్, మే వినియోగానికి సంబంధించి ఏకకాలంలో బిల్లులు జారీ చేస్తున్నామని ఆయన తెలిపారు.
అయితే.. మూడునెలల బిల్లులు ఒకేసారి తీసినా దాన్ని విడదీసి నెల వారిగా లెక్కించామని తెలిపారు. గృహ విద్యుత్తు వినియోగంలో వాడ కం ఆధారంగా 9 శ్లాబులు, 3 కేటగిరీలను నిర్ధారించినట్లు సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. ఈ నెలలో జారీ చేసిన వివిధ రకాల బిల్లులను ఆయన ఉదహరించారు. ఓ వినియోగదారుడికి 3 నెలలకు కలిపి 299 యూనిట్ల వినియోగం నమోదు కాగా.. ప్రతి నెలకు 99 యూనిట్లను లెక్కించామని, 50 యూనిట్లలోపు వాడకానికి యూనిట్కు రూ.1.45, 51-100 యూనిట్లకు రూ.2.60 బిల్లు వేశామని వివరించారు.