సీబీఎస్ఈ పరీక్షల రద్దుపై క్లారిటీ !
కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న క్రమంలో సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్లో ఉన్న పరీక్షలను.... రద్దు చేస్తున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది....
కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న క్రమంలో సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్లో ఉన్న టెన్త్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. పెండింగ్లో ఉన్న సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించబోమని బోర్డు స్పష్టం చేసింది.
వాస్తవానికి దేశంలో సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు మార్చి 18తేదీనే పూర్తయ్యాయి. లాక్డౌన్కు ముందే ఈ పరీక్షలు పూర్తికావడం, జవాబు పత్రాల మూల్యాంకనం వాయిదా పడిన సంగతి తెలిసిందే. మిగిలిపోయిన టెన్త్ పరీక్షలు జరుగుతున్న సమయంలోనే ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో సీఏఏ నిరసనల సందర్భంగా అల్లర్లు జరగడంతో కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. వాయిదా వేసిన పరీక్షలను మార్చి 18 తేదీ తర్వాత నిర్వహించాలని సీబీఎస్ఈ బోర్డు భావించినప్పటికీ, ఆ సమయానికే దేశంలో కరోనా కేసులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను విధించింది. దీంతో ఆ పరీక్షలతోపాటు దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ 12 తరగతి పరీక్షలు కూడా కొన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, పన్నెండో తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తారని గతంలో వచ్చిన వార్తలను సీబీఎస్ఈ తోసిపుచ్చింది. పరీక్షలను పూర్తిగా రద్దు చేసే అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదని గతంలో ప్రకటించిన సీబీఎస్ఈ బోర్డు తాజాగా పదో తరగతి పెండింగ్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.
ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుకున్న విద్యార్థులకు పరీక్షలు రద్దు చేసి అందరినీ పై తరగతులకు ప్రమోట్ చేస్తూ సీబీఎస్ఈ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అలాగే 9,11 తరగతుల విద్యార్థులను వారి ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా ఆయా పాఠశాలల యజామాన్యాలు వారిని పై తరగతులకు ప్రమోట్ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి రమేష్ నిషికాంత్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సీబీఎస్ఈ 12 తరగతి పరీక్షలను కూడా పూర్తిగా రద్దు చేస్తారని ప్రసార, ప్రచార మాద్యమాల్లో వస్తున్న వార్తలను సీబీఎస్ఈ ఖండించింది. ఈ పరీక్షలను పూర్తిగా రద్దు చేసే అవకాశం లేదని సీబీఎస్ఈ కార్యదర్శి అనురాగ్త్రిపాఠి స్పష్టం చేశారు.