AP Inter Board: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ పరీక్షల్లో భారీ సంస్కరణలు..
ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టనుంది. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డు భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది...
AP Inter Board: ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టనుంది. ప్రస్తుతం పరీక్షల నిర్వహిస్తున్న తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డు భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విద్యాశాఖ అధికారుల నుంచి పలు అభిప్రాయాలను తీసుకుని ఇక నుంచి పూర్తి స్థాయిలో జంబ్లింగ్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని చూస్తున్నారు. దీని బట్టి ఇకపై పరీక్షలు నిర్వహించే చీఫ్ సూపరింటెండెంట్లతో సహా ఇన్విజిలేటర్లు, డీవోలు అందరూ కూడా బయటవారే ఉండనున్నారు.
ఏ పరీక్షా కేంద్రంలో కూడా ఆ కాలేజీలకు సంబంధించిన లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు గానీ ఉండటానికి వీలులేదు. ఇదిలా ఉంటే తాజాగా పూర్తయిన ప్రాక్టికల్ పరీక్షల్లో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. పరీక్ష జరుగుతున్న సమయంలో అటెండర్, వాటర్ బాయ్, ఇతర సహాయ సిబ్బంది ఎవరీకి కూడా ఇంటర్ బోర్డు అనుమతులు ఇవ్వలేదు. అలాగే సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. ఇక ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ సిస్టంకు స్వస్తి పలకాలని జగన్ సర్కార్ యోచిస్తున్న విషయం విదితమే. పాత పద్దతిలో మాదిరిగా మార్కులతో పాటు ప్రథమ, ద్వితీయ, తృతీయ క్లాస్లను ఇవ్వాలనే నిర్ణయాన్ని ఈ నెల 26వ తేదీన విద్యాశాఖ మంత్రి ప్రకటించే అవకాశం ఉంది.
కాగా, వచ్చే నెల 4 నుంచి 18 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 10,64,442 మంది విద్యార్థులు వీటికి హాజరు కానున్నారు. ఇక 5,46,162 మంది ఫస్టియర్, 5,18,280 మంది సెకండియర్ ఎగ్జామ్స్ రాయనున్నారు.
Also Read: నన్ను చంపేయ్ అమ్మా.. 9 ఏళ్ళ చిన్నారి ఆవేదన.. వీడియో వైరల్..