డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రుషికొండపై ప్రత్యక్షమయ్యారు. రుషికొండపై నిర్మించిన భవనాలను ఆకస్మికంగా సందర్శించారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించిన పవన్ కల్యాణ్.. తిరుగు ప్రయాణంలో ఋషికొండ భవనాలను సడన్ గా విజిట్ చేశారు. విశాఖ ఎంపీ భరత్, పలువురు ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ తో పాటు ఉన్నారు. కాన్వాయ్ దిగిన పవన్ కళ్యాణ్.. ఋషికొండపై నిర్మించిన భవన సముదాయాలను పరిశీలించారు. కాలినడకన రుషికొండపై తిరిగారు. భవనాల ముందు నుంచి బీచ్ వ్యూ ను చూశారు. నేతలతో మాట్లాడి వివరాలను ఆరా తీశారు. అయితే.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకస్మిక పర్యటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతేడాది ఆగస్టులో.. విశాఖ పర్యటనలో భాగంగా ఋషికొండ ఎర్రమటి దిబ్బలు సందర్శనకు వెళ్లారు పవన్ కళ్యాణ్. ఆ సమయంలో రుషికొండపై అనుమతించకపోవడంతో.. రోడ్డుపై నుంచే కాన్వాయ్ పైకెక్కి భవనాలను చూశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. డిప్యూటీ సీఎం గా పదవి దక్కించుకున్న పవన్ కళ్యాణ్.. నేరుగా కాన్వాయ్ తోనే రుషికొండ పైకి వెళ్లారు. అప్పుడు అలా ఇప్పుడు ఇలా అంటూ చర్చించుకుంటున్నారు జనం.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గడిచిన ఐదేళ్లు పంచాయతీల నిధులు దుర్వినియోగం చేశారంటూ మండిపడ్డారు. ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పని చేయలేదన్నారు. ఐదు వందల కోట్లకు పైగా ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టారని.. ఆ డబ్బు మంచి నీటి కోసం పెట్టి ఉంటే నీళ్ల సమస్య తీరేదంటూ పవన్ పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాలను పరిశీలించిన పవన్ కల్యాణ్.. అక్కడ పనిచేసే కార్మికులతో మాట్లాడారు. స్వయంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు.. బీచ్ వ్యూ ఫొటోలను తన ఫోన్ కెమెరాలో క్లిక్ మనిపించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..